నా వయసు పద్దెనిమిది. ఈ మధ్యే డిగ్రీ పూర్తయింది. నా స్నేహితురాలి తండ్రి తమ కంపెనీలో ఉద్యోగం ఆఫర్ చేస్తున్నారు. మంచి జీతం. కాలేజీ రోజుల్లో నేను చాలాసార్లు ఆ స్నేహితురాలి ఇంటికి వెళ్లాను. వాళ్ల నాన్న నాతో మనసు విప్పి మాట్లాడేవారు. బిజినెస్, ఆంత్రప్రెన్యూర్షిప్, బ్రాండింగ్, వెంచర్ క్యాపిటల్.. ఇలా అనేక విషయాలు చర్చకు వచ్చేవి. నా ఆలోచనల్లో కొత్తదనం ఆయనకు బాగా నచ్చింది. అందుకే ఇంత మంచి అవకాశం ఇచ్చారు. అమ్మానాన్న మాత్రం ఉద్యోగానికి తొందరెందుకు అంటున్నారు. ఎంబీయేలో చేరమని ఒత్తిడి చేస్తున్నారు. నేను ఎటూ నిర్ణయించుకోలేక పోతున్నాను. మీ సలహా కావాలి.
మీ సమస్యను రెండుమూడు కోణాల్లో విశ్లేషించాల్సి ఉంటుంది. కాలం మారిపోయింది. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా ఎంబీయే చదవడం పెద్ద కష్టమేం కాదు. ఆన్లైన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీ కుటుంబ పరిస్థితి ప్రస్తావించలేదు మీరు. మీ సంపాదన అవసరం ఉందా? ఉంటే మాత్రం, ఎక్కడో ఓ చోట ఉద్యోగంలో చేరిపోవడమే మేలు. కన్నవాళ్లకు ఆసరా అవుతుంది. కానీ, వాళ్లే మిమ్మల్ని బాగా చదువుకోమని ప్రోత్సహిస్తున్నారు కాబట్టి, ఆర్థిక సమస్యలు లేవనే అనుకోవాలి.
ఓ సాధారణ సంస్థలో ఒక మోస్తరు జీతంతో కెరీర్ ప్రారంభించడం కంటే.. ఎంబీయే తర్వాత ఓ పెద్ద కార్పొరేట్ కంపెనీలో ట్రైనీగా అయినా సరే ఉద్యోగ జీవితాన్ని మొదలు పెట్టడమే మంచిది. చిన్న సంస్థలో ఉద్యోగం బస్సు ప్రయాణం లాంటిది. కార్పొరేట్ కొలువు విమాన ప్రయాణంతో సమానం. అక్కడ ఎదుగుదల వేగంగా ఉంటుంది. మరొక్క మాట. కొత్తగా డిగ్రీ అందుకున్న మీలాంటి అమ్మాయి పట్ల అతను అవసరానికి మించిన ఆసక్తి చూపిస్తున్నాడేమో అనిపిస్తున్నది. ఎవర్నీ గుడ్డిగా నమ్మకండి. జాబ్ మార్కెట్లో మీ ప్రతిభ మాత్రమే మీకు అండగా ఉంటుంది. కాబట్టి, తక్షణం ఎంబీయేలో చేరిపోండి. ఆ తర్వాత, అవకాశం ఉంటే విదేశాలకు వెళ్లి కూడా చదవండి. దీనివల్ల మీ ప్రపంచం విస్తరిస్తుంది.