నగలంటే ఏ లోహంతోనో చేసినవి అనుకుంటాం. కానీ పూలు, పండ్లు, గింజలతోనూ ఆభరణాలు రూపొందిస్తున్నారు ‘బయో జువెలరీ’ డిజైనర్ సృష్టి ఘనావత్. ఆమెది జైపూర్.
చదువుకునే రోజుల్లోనే పర్యావరణానికి హాని కలిగించని నగలు తయారు చేయాలనే ఆలోచన వచ్చింది సృష్టి ఘనావత్కు. అలా, దేశంలోనే మొదటి బయోజువెలరీ బ్రాండ్ స్థాపకురాలైంది. ‘..అది కూడా సహజ సిద్ధంగా దొరికేవి, ఎంత సేకరించినా తరిగిపోని వాటితోనే నగలు తయారు చేయాలని సంకల్పించాను. అందుకే నా మనసు పూలు, పండ్లు, గింజలు, సుగంధ ద్రవ్యాల్లాంటి వాటి మీదికి పోయింది. వీటిని నగల్లో ఎలా ఇమడ్చాలనే కోణంలో చాలా కసరత్తు చేశాను. ఇది ఆరంచెల ప్రక్రియ. చివరి దశలో.. ఎక్కువకాలం మన్నేలా కోటింగ్ ఇస్తాం.
చివరగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారంతో పూత పూస్తాం. ఫినిషింగ్ తర్వాత అచ్చమైన బంగారు ఆభరణాల్లానే అనిపిస్తాయి. అన్నట్టు, ఇటీవల మేం తీసుకొచ్చిన స్పైస్ కలెక్షన్కు మంచి
పేరొచ్చింది. ఇందులో లవంగాలు, దాల్చిన చెక్క, మొగ్గ, మిరియాలు, పువ్వు.. లాంటి మసాలా దినుసులతో చెవి దుద్దులు, బ్రేస్లెట్లు, గొలుసులు రూపొందించాం. ఇవి కాక ఖర్జూరాలు, శీకాకాయలాంటివీ మా ఆభరణాల్లో ఇమిడిపోయాయి. పర్యావరణాన్ని ప్రేమించే వారంతా ఈ నగల్నీ ఇష్టపడుతారు…’ అంటారు సృష్టి. బయో జువెలరీ అంటే ప్రకృతికి మరింత అందాన్ని అద్దడమే!