ఎండలు మండిపోతున్నాయ్. బయట తిరగక తప్పని పరిస్థితి. ఈ ఎండల్లో చర్మాన్ని కాపాడేందుకు సన్స్క్రీన్ లోషన్లు ఉన్నాయి. చర్మం రంగు మారకుండా, ఏజింగ్ సమస్య రాకుండా, వేడి వల్ల ముఖం కందిపోకుండా సన్స్క్రీన్ లోషన్లు రక్షణ కల్పిస్తాయని చాలామంది నమ్ముతున్నారు. ఈ లోషన్లు చర్మాన్ని కాపాడేది నిజమే.
కానీ, ఒకసారి రాసుకుంటే చాలు ఇక రోజంతా కాపాడుతుందని అనుకోవడం భ్రమ. కాబట్టి బయట కాలుపెట్టే ముందు సన్స్క్రీన్ రాసుకుని వెళ్తే దాని ప్రభావం మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే ఉంటుందట. ముఖాన్ని, చర్మాన్ని రుద్దుకోవడం, ఇతర వస్తువులు తాకడం వల్ల సన్స్క్రీన్ పొర తొలగిపోతుంది.
ఎండ వేడిమికి దాని ప్రభావం తగ్గిపోతుంది. కాబట్టి రోజంతా బయట తిరగాల్సి వస్తే మధ్య మధ్యలో సన్స్క్రీన్ లోషన్ని రాసుకోవడం అవసరమని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఎండకు చర్మం నల్లబడడం, ఎర్రగా కందిపోవడంలాంటి సమస్యలతో బాధపడేవాళ్లు ఈ జాగ్రత్త పాటించాలని సూచిస్తున్నారు. కేవలం ఒకసారి రాసుకుని సాయంత్రం వరకు ఎండలో తిరిగితే చర్మానికి కలిగే ప్రయోజనం అంతంత మాత్రమే అని చెబుతున్నారు.