ఆరోగ్యంపై శ్రద్ధతో ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ను పక్కన పడేస్తున్నారు. కిచెన్ మొత్తాన్నీ రాగి, ఇత్తడి, ఐరన్ సామగ్రితోనే నింపేస్తున్నారు. ఈ క్రమంలో తెలిసీ తెలియక కొన్ని పొరపాట్లు కూడా చేస్తున్నారు. దాంతో, లేనిపోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
చాలామంది రాగి పాత్రలలో పెరుగును నిల్వ చేస్తుంటారు. ఈ పద్ధతి ఏమాత్రం మంచిది కాదు. పెరుగులోని లాక్టిక్ యాసిడ్.. కాపర్తో రసాయన చర్య జరుపుతుంది. ఫలితంగా, ఆరోగ్యానికి హాని కలిగించే విషపూరిత సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. కాపర్ గిన్నెలో నిల్వ చేసిన పెరుగును తింటే.. వికారం, వాంతులతోపాటు విరేచనాలు లాంటి సమస్యలు చుట్టుముడతాయి.
పెరుగుతోపాటు నిమ్మపండ్లలోని సిట్రిక్ యాసిడ్, చింతపండులో ఉండే టార్టారిక్ యాసిడ్, వెనిగర్లోని ఎసిటిక్ యాసిడ్.. ఇవన్నీ రాగి, ఇత్తడితో రసాయన చర్యలు జరుపుతాయి. కాబట్టి.. సిట్రస్ పండ్లు, వాటితో చేసిన పచ్చళ్లు, పుల్లని ఆహార పదార్థాలను వీటిలో నిల్వ చేయొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాగి పాత్రలను కేవలం నీటిని నిల్వ చేయడానికి మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు. అది కూడా 8 నుంచి 12 గంటల పాటే నిల్వ ఉంచాలి. అంతకుమించి నిల్వ ఉన్న నీటిని తాగినా.. ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు.