సాధారణంగా ఏ పదార్థమైనా తియ్యగా ఉందంటే అందులోని చక్కెరలే కారణం. కొన్ని రకాల పండ్లు, కూరగాయలు సహా వివిధ రకాల పదార్థాల్లో చక్కెరలు గ్లూకోజ్, మాల్టోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్ రూపంలో నిలువ ఉంటాయి. అలాగే తేనెలో కూడా తీపిని ఇచ్చే పదార్థం ఉంటుంది. ఆ పదార్థాన్ని ట్రెహలోజ్ అంటారు. ఈ ట్రెహలోజ్ గుండె వ్యాధులను నివారించడానికి తోడ్పడుతుంది. ఈ విషయం తాజాగా ఎలుకలపై జరిగిన ఒక అధ్యయనంలో తేలింది.
ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు కొన్ని ఎలుకల శరీరాల్లోకి ట్రెహలోజ్ను ఇంజెక్ట్ చేసి పరిశీలించారు. ఆ పరిశీలనలో ట్రెహలోజ్కు గుండెపోటు నివారణను సుసాధ్యం చేస్తాయనే లక్షణం ఉందని తేలిందట. తేనెలోని ట్రెహలోజ్ ఇంజెక్ట్ చేసిన ఎలుకల రక్తనాళాల్లో కొత్తగా ప్లాక్ (ఒక రకమైన పాచి) చేరలేదట. పైగా గతంలో చేరిన ప్లాక్లో దాదాపు 30 శాతం వరకు తగ్గుదల కనిపించిందట.
అయితే ట్రెహలోజ్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా కాకుండా నేరుగా నోటి ద్వారా పంపిన ఎలుకల్లోగానీ, ట్రెహలోజ్కు బదులుగా ఇతర రకాల చక్కెరలను ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లోగానీ ప్లాక్ తగ్గుదల కనిపించలేదట.
రక్తనాళాల్లోని ప్లాక్ను శుభ్రం చేసే పనిని మ్యాక్రోఫేజ్ అనే ఒక రకం ఇమ్యూన్ కణాలు చేస్తుంటాయి. వాటిని పుట్టించేందుకు అవసరమైన టీఎఫ్ఈబీ అనే ఒక రకమైన ప్రొటీన్ ఉత్పాదనకు ట్రెహలోజ్ దోహదపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఈ నేపథ్యంలో గుండెపోటు ముప్పును నివారించగల ట్రెహలోజ్ సహాయంతో మనుషుల్లో సైతం రక్తనాళాల్లోని పాచిని తొలగించి, తద్వారా గుండెపోటును నివారించే అవకాశాలపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.
అదేవిధంగా చక్కెరకు బదులు తేనె వాడటం ద్వారా గుండెపోటు ముప్పును నివారించవచ్చా అనే విషయం తెలుసుకునేందుకు వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహిస్తున్నారు.