అమర్నాథ్ యాత్రకు సమయం ఆసన్నమైంది. హిమగిరుల్లో వెలసిన మంచు శివలింగాన్ని దర్శించుకోవడానికి భక్తజనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ఈ యేడాది యాత్ర.. జూలై 3న ప్రారంభమై, ఆగస్టు 28న ముగియనున్నది. మొత్తం 57 రోజులపాటు కొనసాగనున్నది. ఈ క్రమంలో అమర్నాథ్ యాత్రికుల నమోదు ప్రక్రియ ఏప్రిల్ 15న ప్రారంభం కానున్నది. మరి.. ఈ యాత్రకు వెళ్లడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? లాంటి వివరాలు మీకోసం..
ఆన్లైన్: శ్రీ అమర్నాథ్జీ శ్రైన్బోర్డ్ అధికారిక వెబ్సైట్ (https://jksasb.nic.in/) నుంచి నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఫ్లైన్: దేశవ్యాప్తంగా 550కి పైగా నిర్దేశిత బ్యాంకు శాఖలలో దరఖాస్తులు స్వీకరిస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యెస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్లు అధీకృత బ్యాంకుల జాబితాలో ఉన్నాయి. ఒక్కొక్కరికీ రిజిస్ట్రేషన్ ఫీజు రూ.150 ఉంటుంది. రోజువారీ కోటాల ఆధారంగా.. ‘ముందు వచ్చిన వారికి ముందు’ ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు చేస్తారు.
అమర్నాథ్ యాత్ర చాలా కష్టతరంగా సాగుతుంది. పర్వత ప్రాంతం, అధిక ఎత్తులో యాత్ర చేయడం లాంటి కారణాల వల్ల.. కఠినమైన వైద్య నియమాలు అమలు చేస్తారు. యాత్ర చేసేవారి వయోపరిమితి 13 నుంచి 70 ఏళ్ల మధ్య ఉండాలి. వారంతా అధీకృత వైద్యులు, వైద్య సంస్థల నుంచి ఏప్రిల్ 8, 2026 తర్వాత జారీ చేసిన ఆరోగ్య ధృవీకరణ పత్రాన్ని తప్పకుండా సమర్పించాల్సి ఉంటుంది. యాత్ర కోసం నమోదు చేసుకున్న తర్వాత.. యాత్రికులు సిస్టమ్ ద్వారా రూపొందించిన యాత్ర అనుమతిని పొందుతారు. ఇందులో యాత్ర తేదీ, మార్గం (బల్తల్/పహల్గామ్), ప్రవేశ ద్వారం వద్ద సమయం వంటి వివరాలు ఉంటాయి. భద్రతలో భాగంగా.. ప్రతి యాత్రికుడికీ ఒక ఆర్ఎఫ్ఐడీ కార్డ్డును జారీ చేస్తారు.
అమర్నాథ్ యాత్రకు వెళ్లే భక్తులు.. రెండు మార్గాలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఒకటి పహల్గామ్ దారి, రెండోది బాల్టల్ దారి. పహల్గామ్ నుంచి ప్రారంభమయ్యే మార్గం మొత్తం 48 కి.మీ. ఉంటుంది. ఇది సుదీర్ఘమైనదైనా.. సాఫీగా సాగుతుంది. మొదటిసారి యాత్ర చేసేవారికి, పెద్దవారికి సురక్షితమైన మార్గం. ఈ రూట్లో యాత్ర.. సుమారు 3 నుంచి 5 రోజులు పడుతుంది. ఇక బాల్టల్లో యాత్ర మొదలు పెట్టేవారు సుమారు 14 కి.మీ. యాత్ర చేయాల్సి ఉంటుంది. అయితే, దూరం తక్కువైనా.. మార్గం కాస్త కఠినంగా ఉంటుంది. ఈ దారి గుండా నడవడం శారీరకంగా శ్రమతో కూడుకున్నది. ఈ దారిని సాధారణంగా అనుభవజ్ఞులైన ట్రెక్కింగ్ చేసేవారు ఎంచుకుంటారు. ఈ రెండు ట్రెక్కింగ్ మార్గాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉంటాయి. నడవలేనివారికి పోనీలు, పల్లకీలు అందుబాటులో ఉంటాయి. ఇక హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకునేవారు.. అధికారిక వెబ్సైట్ ద్వారా ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
అమర్నాథ్ యాత్రకు కనీసం ఒక నెల రోజుల ముందు నుంచే వ్యాయామం మొదలుపెట్టడం మంచిది. ప్రతిరోజూ నాలుగైదు కిలోమీటర్లు నడవడం అలవాటు చేసుకోవాలి. ప్రాణాయామం లాంటి బ్రీథింగ్ ఎక్సర్సైజులు చేయాలి. పర్వత ప్రాంతాల్లో తక్కువ ఆక్సిజన్ ఉన్నా.. తట్టుకునే శక్తి లభిస్తుంది. ఇక హిమాలయాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారుతుంది. కాబట్టి ఉన్ని దుస్తులు, థర్మల్స్, రెయిన్ కోట్, గ్లౌజులు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, ఆల్టిట్యూట్ సిక్నెస్ కోసం ప్రాథమిక మందులు దగ్గర ఉంచుకోవాలి.