అస్సామీ భాషలో బిజు అంటే విజేత అని అర్థం. కానీ, అస్సాం రాష్ట్రం జోర్హాట్ జిల్లాకు చెందిన బిజు కుమార్ సర్మాను స్థానికులు బీజ్ (విత్తనం) కుమార్ సర్మా అని ప్రేమగా పిలుచుకుంటారు. ఆయన జ్యోతి ప్రతాప్ గ్యాన్మార్గ్ విద్యాలయ్లో ఉపాధ్యాయుడు. పర్యావరణ ప్రేమికుడైన బిజు కొన్నేండ్లుగా తన చుట్టుపక్కల సమాజంలో పర్యావరణ పరిరక్షణ విత్తనాలు నాటుతున్నాడు. అందుకే ఆయనను బీజ్ అని ముద్దుగా పిలుచుకుంటారన్నమాట. స్థానికులకు మొక్కలను బహుమతిగా ఇస్తాడు కాబట్టి ఆయన ‘గోస్పులి’ (మొక్క) అనే మారుపేరుతో ప్రసిద్ధిచెందాడు. బిజు గురించి తెలుసుకున్న అస్సాం ప్రభుత్వం ఆయనను 2014 16 సంవత్సరాల మధ్య గౌరవ అటవీ రక్షకుడిగా పనిచేయడానికి అవకాశం ఇచ్చింది. అయితే, ఆయన అంతకుముందే తన ద్విచక్రవాహనపై తిరుగుతూ స్థానికులకు సంచులకొద్ది మొక్కలు పంపిణీచేశాడు.
“పిల్లాడిగా ఉన్నప్పుడు మా ఊరు మీదుగా పారే మరిజ్హాంజి నదిలో చేపలు పుష్కలంగా ఉండేవి. కాలక్రమంలో నదిలో వాటి సంఖ్య చాలా తగ్గిపోయింది. దీనికి అడవులు తగ్గిపోవడం కూడా ఒక కారణం కావొచ్చు. అందుకే నేను పర్యావరణం పట్ల అవగాహన కల్పించే పనికి నడుంబిగించాను. మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాను” అంటాడు బిజు. కాగా, బిజు 2002లో ‘న్యూ గ్రామ్ సేవా సంస్థ’ అనే ఎన్జీవోలో చేరాడు. సంస్థ తరఫున పర్యావరణం, ఆరోగ్యం తదితర అంశాలపట్ల అవగాహన కల్పించడానికి అస్సాం మొత్తం పర్యటించాడు. 2014లో తండ్రి జబ్బుపడటంతో సొంతూరికి వచ్చేశాడు. తండ్రి కూడా బిజును బయటికి వెళ్లొద్దని సూచించాడు. దాంతో తానే సొంతంగా ‘రెంగోని, ఎ హోప్’ పేరుతో ఎన్జీవో ప్రారంభించాడు.
తనలాంటి ఆలోచనలే ఉన్న తొమ్మిది మందితో ఓ బృందాన్ని ఏర్పాటుచేశాడు. వారి సాయంతో తన ప్రయత్నాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. బిజు పర్యావరణ ప్రయాణంలో అతనికి అస్సాం అటవీశాఖ సహా వివిధ ప్రభుత్వ విభాగాలు, సంస్థలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా బిజు బృందం విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారించింది. జోర్హాట్, మజూలి, శివ్సాగర్, కామ్రూప్ జిల్లాల్లో బళ్లు, కాలేజీల్లో అవగాహన తరగతులు నిర్వహించింది. ఇప్పటివరకు లక్ష మొక్కలు నాటిన బిజు బృందం మరెన్నో లక్షల మొక్కలను స్థానికులకు పంపిణీ చేసింది. చెట్లు నాటడం వల్ల… పర్యావరణ పరిరక్షణతోపాటు, ప్రజలకు జీవనోపాధి దొరుకుతుందని బిజు అంటాడు.