జంక్ఫుడ్ వెంట పడుతున్న నేటితరం పిల్లలు.. పోషకాహారానికి దూరం అవుతున్నారు. ఈ క్రమంలో చాలామంది సంప్లిమెంట్లను ఆశ్రయిస్తున్నారు. అయితే, శరీరానికి అవసరమైన పోషకాల కోసం సహజసిద్ధమైన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లోనే సప్లిమెంట్లను తీసుకోవాలని అంటున్నారు. ఈ క్రమంలో సహజసిద్ధమైన పోషకాహారం-సప్లిమెంట్లకు మధ్యగల తేడాలను వివరిస్తున్నారు.
కొన్నివేల సంవత్సరాలుగా ప్రకృతి నుంచి వచ్చే ఆహారాన్ని జీర్ణం చేసుకునేలా మన శరీరం పరిణామం చెందింది. అందుకే, ఆహారం ద్వారానే పోషకాలు అధికంగా గ్రహిస్తుంది. ఆహారంతో పోషకాలతోపాటు మరిన్ని అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు.. ఒక ఆరెంజ్ తింటే విటమిన్ సితోపాటు ఫైబర్, పొటాషియం, వందలాది ‘ఫైటో కెమికల్స్’ శరీరానికి అందుతాయి.
ఇవన్నీ కలిసి పనిచేస్తేనే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. సప్లిమెంట్లలో ఇలాంటి వెసులుబాటు ఉండదు. ఇక మొక్కల నుంచి లభించే ఆహారంలో మన ఆరోగ్యానికి హామీనిచ్చే ఎన్నో రకాల రసాయనాలు ఉంటాయి. క్యాన్సర్ లాంటి మహమ్మారుల నుంచి కాపాడతాయి. ఇలాంటివి మల్టీ విటమిన్ మందులలో లభించవు. అంతేకాకుండా, ఆహారం ద్వారా విటమిన్లు తీసుకున్నప్పుడు మోతాదు మించడం అనేది ఉండదు. శరీరానికి హాని కలిగే
అవకాశం కూడా ఉండదు.
సప్లిమెంట్లను ఎప్పుడూ ఆహారానికి ప్రత్యమ్నాయంగా చూడొద్దు. వాటిని పోషకాలు, విటమిన్ల లోటును భర్తీ చేసే వనరుగా మాత్రమే చూడాలి. వైద్య పరీక్షల్లో ఏదైనా విటమిన్ చాలా తక్కువగా ఉన్నట్లు తేలినప్పుడు, ఆహారం ద్వారా త్వరగా పెంచడం సాధ్యం కాని సందర్భంలో సప్లిమెంట్లు అవసరం అవుతాయి. మరికొందరిలో వయసు పెరిగేకొద్దీ, జీర్ణకోశ సమస్యల వల్ల ఆహారం నుంచి పోషకాలను శరీరం సరిగ్గా గ్రహించలేదు. అలాంటివారు సప్లిమెంట్లను ఆశ్రయించవచ్చు. అది కూడా వైద్యుడి సలహా తీసుకున్న తర్వాతే!