ఇటీవల వైరల్, టైఫాయిడ్లాంటి జ్వరాలు విస్తరిస్తున్నాయి. వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఎలా? ఇమ్యూనిటీ పొందడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియజేయండి.
– ఓ పాఠకురాలు
ఈ సీజన్లో జ్వరాలు ప్రబలుతుంటాయి. అందులోనూ ఒకరినుంచి మరొకరికి సోకేవే ఎక్కువ. దాంతో చుట్టుపక్కల వ్యక్తుల ద్వారా మనమూ వాటి బారిన పడే ఆస్కారం ఉంటుంది. విష జ్వరాలు మనదాకా రాకూడదన్నా, వచ్చినా వేగంగా తగ్గిపోవాలన్నా, జ్వరాల వల్ల శరీరం ఎక్కువగా ఇబ్బంది పడకూడదన్నా ఇమ్యూనిటీ చాలా ముఖ్యం. నిజానికి ఇమ్యూనిటీ రెండు రకాలు. ఒకటి పుట్టుకతో వచ్చేది, మరొకటి మనం సంపాదించుకునేది. ఉదాహరణకు అమ్మవారు ఒకసారి వచ్చి తగ్గితే మన శరీరంలో యాంటీబాడీస్ ఏర్పడతాయి. మళ్లీ జీవితంలో అమ్మవారు సోకదు. అయితే, రోగ నిరోధక శక్తిని బలోపేతం చేసుకోవాలంటే జీవనశైలి మార్పులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం, చక్కని వ్యాయామం అవసరం.
ఆ ప్రయత్నంలో తాజా ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాల్లాంటి ప్రకృతి సహజంగా దొరికే ఆహార పదార్థాలు ఎంతగానో సహకరిస్తాయి. వీటిలో అధిక మోతాదులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్, విటమిన్లు రోగ నిరోధక శక్తిని దృఢ పరుస్తాయి. విటమిన్-సి కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. జామ, ఉసిరి, బత్తాయి, ద్రాక్ష, నిమ్మలాంటి పండ్లలో ఇది బాగా దొరుకుతుంది. విటమిన్-ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఇమ్యూనిటీ పెంచుకోవడంలో ఉపకరిస్తాయి. బాదంతో పాటు వాల్నట్స్, పొద్దు తిరుగుడు, గుమ్మడి గింజల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. పాలు, పాల పదార్థాలు, గుడ్డులాంటి వాటిలో దొరికే ప్రొటీన్ కూడా మేలు చేస్తుంది. మైదా, పిజ్జా, బర్గర్లు, కూల్డ్రింక్స్ మొదలైనవి జీర్ణవ్యవస్థను బలహీన పరచి ఇమ్యూనిటీని దెబ్బతీస్తాయి. అల్లం నీళ్లు, పసుపు నీళ్లు, జీలకర్ర నీళ్ల లాంటివి ఇన్ఫెక్షన్లను పారదోలేందుకు సహకరిస్తాయి. పాలు, ఎండ నుంచి లభించే విటమిన్-డి కూడా రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అందుకే శరీరానికి ఎండ తగిలేలా జాగ్రత్తపడేవారు ఎంతో చురుగ్గా, ఆరోగ్యంగా ఉంటారు.
మయూరి ఆవుల , న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@gmail.com