ఢిల్లీలో జరిగిన చిరుధాన్యాల సదస్సులో తెలంగాణ తండా మహిళ గొంతు విప్పింది. పాత పంటల ప్రాధాన్యాన్ని గుర్తుచేసింది. రసాయనాల తీవ్రతను హెచ్చరించింది. ప్రపంచానికంతా ఆరోగ్య పాఠాన్ని బోధించింది. ఆమె ఆలోచనలు శాస్త్రవేత్తలనూ ఆలోచింపజేశాయి.
పూర్వం తెల్లజొన్న, పచ్చజొన్న, గోధుమ, సజ్జ రొట్టెలు తినేవారు. మట్టికుండలో పప్పు, కొర్రబువ్వ వండుకునేవారు. మంచినీళ్లు కుండలో నిల్వ ఉంచుకుని తాగేవారు. కాబట్టే, రోగాలు తెలియవు. వ్యాధుల బాధల్లేవు. క్రమంగా సేద్యంలో రసాయనాలు ప్రవేశించాయి. కృత్రిమ పద్ధతుల పెత్తనం అధికమైంది. దీంతో శరీరం రోగాల పుట్టగా మారింది. తప్పు తెలుసుకున్న మనిషి.. మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. సిరిధాన్యాలపై ఆసక్తి చూపుతున్నాడు. మట్టిపాత్రలు వాడుతున్నాడు. ఇత్తడి, రాగి రంగప్రవేశం చేశాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో మహిళా రైతులు పాతకు జాతర చేస్తున్నారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో చిరుధాన్యాల సాగు, పాత వంటలు, వంటింటి సామగ్రిపై అర్జున్నాయక్ తండా మహిళలు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ(డీడీఎస్), కేవీకే అందిస్తున్న సాయాన్ని గుర్తుచేసుకున్నారు.
‘మా వ్యవసాయ భూమిలో వర్షాధారంగా 30 రకాల పంటలను పండిస్తున్నాం. ఎక్కడా రసాయన ఎరువులు వేయడం లేదు. అంతరించి పోతున్న జీవవైవిధ్య పంటలైన పచ్చజొన్న, తెల్లమల్లెజొన్న, ఎర్రజొన్న, కాకిముట్టని జొన్న, తెల్లకొర్ర, మంచికొర్ర, నల్లకొర్రలు, ఎర్రకొర్రలు.. మొదలైనవాటి గురించి ఢిల్లీ సదస్సులో వివరించాను’ అని చెప్పింది అర్జున్నాయక్ తండాకు చెందిన చన్నుబాయి. అదే గ్రామ మహిళ చందుబాయి కూడా ఛలో ఢిల్లీలో పాల్గొన్నది. ‘మట్టికుండలో నీళ్లు నిల్వ చేసుకొని తాగే పరిస్థితి వస్తున్నది. కరోనా వచ్చినప్పటి నుంచి మనుషుల జీవన విధానంలో చాలా మార్పువచ్చింది. పాత పరిస్థితులు వస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే స్పృహ పెరిగింది’ అంటున్నదామె.
-గౌని దౌలయ్య