అవని నుంచి గగనం వరకు అతివ అన్ని రంగాల్లో రాజ్యమేలుతున్నది. ఇప్పుడు భూగర్భంలోనూ తనకు చోటుందని నిరూపించింది హైదరాబాద్కు చెందిన గాయత్రి. 114 ఏండ్ల టాటా స్టీల్ చరిత్రలో మొట్టమొదటి మైనింగ్ ఇంజినీర్గా వార్తల్లోకి ఎక్కింది. సాధారణంగా ఇంజినీరింగ్ పట్టభద్రులు భద్రంగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగాలను ఎంచుకుంటారు. కానీ, గాయత్రి మాత్రం కొత్త పంథాను ఎంచుకోవాలని భావించింది.
ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నప్పుడు టాటా స్టీల్స్లో ఇంటర్న్షిప్ చేసింది. అప్పుడే ఆమెకు మైనింగ్ ఎంత కష్టమో తెలిసొచ్చింది. నల్లేరు మీద నడక కాదు.. పల్లేరు కాయల కన్నా కఠినంగా ఉండే భూగృహంలో సత్తా చాటాలని ఫిక్సయింది. అందుకే, మైనింగ్లోకి రంగప్రవేశం చేసింది. ఇంజినీరింగ్ పూర్తవగానే టాటా స్టీల్స్లో అవకాశం వచ్చింది. ‘నేను సాధించిన దానికి గర్వపడుతున్నాను. మొదట్లో ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఇప్పుడు మరికొంత మంది మహిళా ఇంజనీర్లు జాయిన్ అవుతున్నారు. వాళ్లందరికీ ఆదర్శంగా ఉండటం సంతోషంగా ఉంద’ని చెప్పుకొచ్చింది గాయత్రి.