రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. జనాల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వాతావరణంలో వస్తున్న మార్పులతో.. అనేక ఆరోగ్య సమస్యలూ పలకరిస్తున్నాయి. చాలామందిలో వేసవిలో వేడికారణంగా వాంతులు, వికారం, తలనొప్పి, అజీర్ణం వంటి సమస్యలు మొదలవుతాయి. ఇలాంటి సమయంలో కొన్ని ఆహారపదార్థాలు.. వేసవి వేడికి విరుగుడుగా పనిచేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. మీ కడుపును చల్లగా ఉంచుతాయి.
కొన్ని ఆహారపు అలవాట్లు.. వేసవిలో కడుపులో వేడిని పెంచేస్తాయి. వంటల్లో కారం ఎక్కువగా వాడటం, మాంసాహారం, ధూమపానంతోపాటు టీ, కాఫీలు అతిగా తీసుకోవడం, సరైన సమయంలో తినకపోవడంతోపాటు కొన్నిరకాల మందులు కూడా కడుపులో వేడి పెరగడానికి కారణం అవుతాయి.
వేసవిలో ఆహారపు అలవాట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్లో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. నూనెలో వేయించినవి, కారంగా ఉండే ఆహార పదార్థాలను తగ్గించాలి. పూర్తిగా మానేస్తే ఇంకా మంచిది. ఉదయం ఖాళీ కడుపుతోనే గోరువెచ్చని నీరు తాగాలి. నిద్రలేచిన 1-2 గంటల్లోపే అల్పాహారం తీసుకోవాలి. ఎక్కువ సమయంపాటు ఖాళీ కడుపుతో ఉండకూడదు. ఇక రోజంతా నీరు తాగుతూనే ఉండాలి.
పుదీనా: వేసవిలో పుష్కలంగా లభించే తాజా పుదీనాను ఆహారంలో భాగం చేసుకోవాలి. పుదీన నీళ్లు తాగినా.. కడుపులో ఆమ్లం ఇట్టే తగ్గిపోతుంది.
తులసి ఆకులు: బ్రష్ చేసిన వెంటనే.. రెండుమూడు తులసి ఆకులను నమిలి మింగేయాలి. ఖాళీ కడుపుతో తులసి ఆకులను నమలడం వల్ల కడుపులో నీటి పరిమాణం పెరుగుతుంది. కడుపులో ఆమ్లాన్ని తగ్గిస్తుంది. తులసి ఆకులతో టీ చేసుకొని తాగినా.. మంచి ఫలితాలు కనిపిస్తాయి.
సోంపు: కడుపును చల్లగా ఉంచడంలోనూ, వేడిని తగ్గించడంలో సోంపు సమర్థంగా పనిచేస్తుంది. భోజనం తర్వాత కాస్త సోంపు నమిలితే.. కడుపులో చికాకు తగ్గుతుంది. సోంపు నీటిని కూడా తాగవచ్చు.
అరటిపండు: వేసవిలో ప్రతిరోజూ ఒక అరటిపండు తినాలి. వీటిలో అధిక మొత్తంలో లభించే పొటాషియం.. కడుపులో ఆమ్లాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
పాలు: వేసవిలో వేడి పాలు నచ్చకుంటే.. చల్లని పాలే తాగాలి. అల్పాహారంగా ప్రతిరోజూ ఒక కప్పు చల్లని పాలు తాగితే.. ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది. ఇందులోని కాల్షియం.. కడుపు వేడిని తగ్గిస్తుంది. చల్లదనాన్ని అందిస్తుంది.