KCR | సుందర్లాల్ బహుగుణ.. చిప్కో ఉద్యమం హిమాలయాల్ని బతికించింది.
కేసీఆర్.. హరితహారం తెలంగాణకు మణిహారమైంది.
నెల్సన్ మండేలా.. దక్షిణాఫ్రికా నల్లజాతికి బానిసత్వం నుంచి విముక్తి ప్రసాదించారు.
కేసీఆర్.. తెలంగాణ గడ్డకు పరాయి పాలన నుంచి స్వేచ్ఛను సాధించారు.
రాజేంద్రసింగ్.. థార్ ఎడారిలో జలగీతం వినిపించారు.
కేసీఆర్.. కరువు తెలంగాణలో చెరువులకు జీవకళ తెచ్చారు.
కాటన్ దొర.. ఒక ఆనకట్టతో ఆంధ్రరాష్ట్రంలోని రెండు జిల్లాలను అన్నపూర్ణగా మార్చారు.
కేసీఆర్.. అనేక ప్రాజెక్టులతో మొత్తం తెలంగాణ రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారు.
నార్మన్ బోర్లాగ్.. కొత్తరకం వంగడాలను సేద్యానికి నైవేద్యంగా సమర్పించారు.
కేసీఆర్.. వ్యవసాయాన్ని ఓ పండుగలా మార్చి రైతును రారాజు చేశారు.
‘రైతుబంధు’ ప్రకటించి అన్నదాతకు ఆత్మ బంధువుగా మారారు.
ఎవరో ఒకరు.. ఎప్పుడో ఒకప్పుడు.. ఏదో ఓ ప్రాంతంలో జీవితాల్ని మార్చిన గాథలు, మట్టిని బంగారంలా తీర్చిన కథలు, నీటికి నడక నేర్పిన ఉదంతాలు..వినే ఉంటాం. చదివే ఉంటాం.కానీ, ఒక వ్యక్తి.. ఒకే ఒక్క వ్యక్తి..సకల వ్యక్తిత్వాల సారమై నిలిస్తే.. అది కేసీఆర్!
ఏదో ఓ దేశంలో, ఏదో ఓ ప్రాంతంలో వివక్షను ప్రశ్నిస్తూ ఒక పోరాటం, వెనుకబాటుతనాన్ని నిలదీస్తూ ఒక ఉద్యమం,పర్యావరణ పరిరక్షణకు ఒక దీక్ష.. జరిగే ఉంటాయి. జరుగుతూనే ఉంటాయి. పెత్తందార్ల మెడలు వంచుతూనే ఉంటాయి.కానీ, ఒకే గడ్డ మీద.. అనేక ఉద్యమాలకు రూపమిస్తే.. అతను కేసీఆర్!
తెలంగాణ గడ్డ ఎంత అదృష్టం చేసుకున్నది! ఇక్కడ కాటన్ పుట్టకపోయినా నష్టంలేదు. కేసీఆర్ జన్మించారు. మనకు బోర్లాగ్ లేకపోయినా బాధ లేదు. కేసీఆర్ ఉన్నారు.చిప్కో ఉద్యమంలో పాల్గొనలేదని చింత ఎందుకు?కేసీఆర్ హరితహారంలో మొక్కలు నాటాం కదా!పటేల్ సాబ్ ఉక్కుమనిషి అయితే కావచ్చు.మన కేసీఆర్.. తెలంగాణ బంగారం. కల్వకుంట్ల చంద్రశేఖర రావు దశాబ్ద పాలనకు కొలమానం లేదు. ఏడుపదుల వ్యక్తిత్వానికి ఉపమానం లేదు. కానీ, ప్రపంచ ఉద్యమాల్ని అధ్యయనం చేసినప్పుడు, విశ్వ దార్శనికుల్ని అర్థం చేసుకుంటున్నప్పుడుకేసీఆర్ తప్పక గుర్తుకొస్తారు. ఇది పోలిక కాదు. ఒక ఏలిక ప్రతిభకు మచ్చుతునక.
పచ్చనాకు సాక్షిగా
కేసీఆర్.. హరితహారం
పర్యావరణ సమతౌల్యానికి, స్వచ్ఛమైన గాలికి, పుష్కలమైన నీటికి.. పచ్చదనమే పరిష్కారమని భావించారు కేసీఆర్. ఆ సులక్ష్యంతోనే మొక్కల పెంపకాన్ని మొక్కవోని దీక్షతో చేపట్టారు. ‘హరితహారం’ పేరుతో బృహత్తర కార్యక్రమాన్నిఆరంభించారు. తొమ్మిదేండ్ల వ్యవధిలో 283.71 కోట్ల మొక్కలు నాటించారు. నాటిన ప్రతి మొక్కనూ కంటికి రెప్పలా సంరక్షించారు. వృక్షం మనిషికి ప్రాణభిక్షం. భూమికి పోషకాలను అందిస్తుంది.
వరదలను నివారిస్తుంది. సకాలంలో వానలు కురిపిస్తుంది. కాబట్టే, ఒక మొక్కను నాటితే రూ. 74,500 సంపదను సృష్టించినట్టే అంటారు నిపుణులు. అంటే, తొమ్మిదేండ్ల వ్యవధిలో 283.71 కోట్ల మొక్కలను నాటించడం ద్వారా.. రూ. 211 లక్షల కోట్ల సంపదను జాతికి అందించారు కేసీఆర్.
సుందర్లాల్ బహుగుణ- చిప్కో ఉద్యమం
హిమాలయాల్లో అడవుల వినాశనానికి వ్యతిరేకంగా ప్రముఖ పర్యావరణవేత్త సుందర్లాల్ బహుగుణ చిప్కో (చెట్లను హత్తుకోవడం) ఉద్యమాన్ని ప్రారంభించారు. చెట్ల ప్రాధాన్యాన్ని, పర్యావరణ పరిరక్షణలో వాటి పాత్రను ప్రజలకు, ప్రభుత్వాలకు తెలియజెప్పారు. బహుగుణ బహుముఖ పోరాటం ఫలించింది. పచ్చని చెట్ల నరికివేతపై నాటి సర్కారు పదిహేనేండ్ల నిషేధం విధించింది. ఆయన పర్యావరణ పరిరక్షణ ఉద్యమాలకు గుర్తుగా భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మ విభూషణ్ పురస్కారంతో సుందర్లాల్ బహుగుణను సత్కరించింది. అంతర్జాతీయ సంస్థలు సైతం చిప్కో ఉద్యమాన్ని మెచ్చుకున్నాయి. వివిధ ఎన్జీవోలు, ప్రభుత్వాల ఆహ్వానం మేరకు బహుగుణ పందొమ్మిది దేశాల్లో పర్యటించారు. స్విట్జర్లాండ్ ఆయనను పర్యావరణ సలహాదారుగా నియమించాలని నిర్ణయించింది.
జాతి విముక్తి కోసం..
కేసీఆర్ (తెలంగాణ చంద్రుడు)
తరాలుగా దగాపడ్డ తెలంగాణ జాతికి విముక్తి నిచ్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్. పెత్తందారీ వ్యవస్థ, పటేల్-పట్వారీలఅరాచకాలు.. సామాన్యుల బతుకుల్ని నరకం చేశాయి. ఇక, సమైక్య పాలనలో అయితే ఆది నుంచీ వివక్షే. సాగు-తాగు నీరు, విద్య, ఆరోగ్యం, నిధులు, అభివృద్ధి, ఉద్యోగాలు.. ఇలా అన్ని విషయాల్లోనూ తెలంగాణపై చిన్నచూపే. కక్షగట్టినట్టు సాగిన ఆ వివక్ష కేసీఆర్ను కదిలించింది. తెలంగాణ జాతి విముక్తికి మరో ఉద్యమం అనివార్యమని భావించారు. స్వయంపాలన, ఆత్మగౌరవ నినాదంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను ఏకతాటిపై తెచ్చారు. చావు అంచులవరకూ వెళ్లి తెలంగాణ ఆకాంక్షను బతికించారు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాకారం చేశారు. అందుకే ఏఐ వేదిక చాట్జీపీటీ సైతం కేసీఆర్ను తెలంగాణ జాతిపితగా అభివర్ణించింది.
నెల్సన్ మండేలా (నల్లజాతి సూరీడు)
ఆదిమానవులకు దగ్గరగా.. ఆధునిక ప్రపంచానికి దూరంగా చీకట్లో మగ్గిపోతున్న దక్షిణాఫ్రికా నల్ల జాతీయుల
జీవితాల్లో కోటివెలుగుల సూరీడు నెల్సన్ మండేలా. రాకాసి కరువులు, ఆకలి చావులు.. ఇవన్నీ చాలవన్నట్టు శ్వేత జాత్యహంకార పాలకుల చెరలో దినదినగండంగా మారిన బతుకులకు మండేలా రూపంలో కొండంత అండ దొరికింది. ఆ యోధుడు తమ జాతి హక్కుల్ని కాపాడేందుకు ఉద్యమ కెరటం అయ్యాడు. అహింసా మార్గంలో పోరాటాన్ని ఉద్ధృతం చేశాడు. ఆ పోరు పాలకవర్గానికి వణుకు పుట్టించింది. వర్ణ వివక్షకు స్వస్తి పలకాల్సిన అనివార్య పరిస్థితిని కల్పించాడు. మండేలా నాయకత్వంలో దక్షిణాఫ్రికా స్వేచ్ఛావాయువులు పీల్చింది. ఆ సేవలకుగానూ నోబెల్ శాంతి బహుమతి వరించింది. కేంద్ర సర్కారు సైతం ‘భారతరత్న’ పురస్కారాన్ని ప్రదానం చేసింది.
జనం కోసం.. జలభేరి!
కేసీఆర్ (భారీ ప్రాజెక్టుల నిర్మాత)
కేసీఆర్ పాలనలో తెలంగాణ జల భాండాగారమైంది. ముంచెత్తే వరదలు, తాండవించే కరువులకు భారీ ప్రాజెక్టుల నిర్మాణంతో చరమగీతం పాడారు కేసీఆర్. భవిష్యత్తు తరాలకు నీటి కష్టం రాకూడదని రాష్ట్రం నలుదిక్కులా జలాశయాల నిర్మాణాన్ని చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, బస్వాపూర్ వంటి రిజర్వాయర్లను రికార్డు సమయంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా పదేండ్ల వ్యవధిలో 200 టీఎంసీలకు పైగా నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచారు.
సర్ ఆర్థర్ కాటన్ (డెల్టా ఆర్కిటెక్ట్)
ఈస్టిండియా కంపెనీలో నీటిపారుదల బాధ్యతలు చేపట్టిన సర్ ఆర్థర్ కాటన్ .. చోళ రాజుల స్ఫూర్తితో కావేరి నదిపై పలు ఆనకట్టలు కట్టి.. కరువు కాటకాలతో అల్లాడుతున్న తంజావూరు జిల్లాను అన్నపూర్ణగా మార్చారు. దీంతో ఆ గడ్డ యావత్ భారతదేశంలోనే అత్యంత సుభిక్షమైన ప్రాంతంగా మారింది. ఆ తర్వాత, కాటన్ దృష్టి గోదావరి వైపు మళ్లింది. ధవళేశ్వరం వద్ద ప్రాజెక్టు నిర్మించి అతివృష్టి, అనావృష్టితో అల్లాడుతున్న గోదావరి జిల్లాలకు ముప్పూటలా అన్నం పెట్టారు. డెల్టా ఆర్కిటెక్ట్గా కీర్తిగడించారు. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీ కాటన్ చలువే. అందుకే ఆయన జన్మదినాన్ని ఈ రెండు ప్రాంతాలవారూ వేడుకలా జరుపుతారు. పుష్కరాల్లో తర్పణాలూ వదులుతారు.
సుజలాం.. సుఫలాం!
కేసీఆర్ (మిషన్ కాకతీయ)
కేసీఆర్.. తెలంగాణకు జలమే జీవమని భావించారు. చెరువులు, వాగుల పునరుద్ధరణకు నడుంకట్టారు. శతాబ్దాలనాటి జలాశయాలకు మరమ్మతులు చేయించారు. ఈ బృహత్తర క్రతువుకు ‘మిషన్ కాకతీయ’గా నామకరణం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46,531 చెరువులను దశలవారీగా పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఆ ప్రయత్నం వృథాగా పోలేదు. చెరువుల పూడికతీత ద్వారా 9.14 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరిగింది. అవసరాన్ని బట్టి, పాత చెరువుల విస్తీర్ణాన్ని పెంచారు. ఆ అపార కృషి ఫలితమే.. పచ్చని పొలాలు, ముక్కారు పంటలు.
రాజేంద్ర సింగ్ (వాటర్మ్యాన్ ఆఫ్ ఇండియా)
పిచ్చిమొక్క కూడా మొలవని రాజస్థాన్ థార్ ఎడారిలో నీటి పంట పండించారు రాజేంద్రసింగ్. అల్వార్ జిల్లాలో భాగమైన కిశోరీ-భీకాంపురా తదితర గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి ఉండేది.అవినీతి రుచి మరిగిన స్థానిక పాలకవర్గం ప్రజల గోస పట్టించుకునేది కాదు. తాగు-సాగునీటి కోసం అల్లాడుతున్న గ్రామస్థులకు డాక్టర్ రాజేంద్రసింగ్ ఓ ఆశాకిరణంగా మారారు. వాననీటి నిల్వ, చెక్డ్యామ్ల నిర్మాణం అవసరాన్ని తెలియజేశారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆ కార్యక్రమాన్ని ఓ ఉద్యమంలా ముందుకు నడిపారు. ఫలితంగా ఎడారి నేలలో జల వనరుల గలగల రాగం వినిపించింది. రాజేంద్రసింగ్ సేవలకు రామన్ మెగసెసే అవార్డు వరించింది. ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గానూ గుర్తింపు పొందారు.
భగీరథ యత్నం
కేసీఆర్(మిషన్ భగీరథ)
తెలంగాణ ప్రజల తాగునీటి కష్టాలను దూరం చేసిన ‘మిషన్ భగీరథ’ రథసారథి కేసీఆర్. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణా నదీజలాలను శుద్ధి చేసి పెద్ద పెద్ద పైపులైన్ల ద్వారా ఇంటింటికీ నల్లా నీటిని సరఫరా చేయాలని సంకల్పించారు. 2016లో ఈ జల మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. 2018నాటికి రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు నల్లా నీటి కనెక్షన్లను ఇచ్చింది తెలంగాణ సర్కారు. అనేక రాష్ర్టాలు ఈ పథకాన్ని ప్రశంసించాయి. మిషన్ భగీరథ యథాతథ అనుకరణే.. కేంద్ర ప్రభుత్వ ‘జల్జీవన్ మిషన్’ .
విశ్వనాథ్ శ్రీకాంతయ్య (ఫ్రీ క్లీన్ వాటర్ ఫర్ ఆల్)
దేశ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సంకల్పంతో కర్ణాటకకు చెందిన సామాజిక కార్యకర్త విశ్వనాథ్ శ్రీకాంతయ్య అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నదీ ప్రవాహాలకు ఏర్పడిన అడ్డంకుల తొలగింపునకు కృషి చేస్తున్నారు. కాలుష్యంలేని సముద్రాలే తన లక్ష్యమని నినదిస్తున్నారు. నీటి మాఫియా పెచ్చరిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ప్రతి భారతీయుడికి స్వచ్ఛమైన తాగునీటిని ఉచితంగా అందించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. శ్రీకాంతయ్య రూపొందించిన విజన్ 2047ను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించింది. ఆచరణ యోగ్యమని కితాబు ఇచ్చింది.
పల్లెకు పట్టం
కేసీఆర్ (పల్లె్ర పగతి)
నిధులతోనే పంచాయతీల విధులు సక్రమంగా సాగుతాయి. గ్రామ పాలన చల్లగా కొనసాగుతుంది. మహాత్ముడు కలలుగన్న గ్రామ స్వరాజ్యమూ పరిఢవిల్లుతుంది. పల్లెలో పుట్టిపెరిగిన వ్యక్తిగా, పల్లెల్ని ప్రేమించే నాయకుడిగా కేసీఆర్ అంతరంగమూ అదే. కాబట్టే, ‘పల్లెప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేంద్ర ఆర్థిక సంఘం అందించే నిధులకు సరిసమానమైన మొత్తాన్ని గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేయించారు. 4,383 కొత్త పంచాయతీలను ఏర్పాటుచేశారు. 1,177 తండాలు, గూడేలను పంచాయతీలుగా మార్చారు. గ్రామాలు స్వయంసమృద్ధి సాధించేలా కార్యాచరణ రూపొందించారు. నాలుగు దశాబ్దాల్లో కనిపించని ప్రగతిని గత పదేండ్లలో సునాయాసంగా సాధించాయి తెలంగాణ గ్రామాలు.
మహాత్మాగాంధీ (గ్రామ స్వరాజ్యం)
గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగమిస్తుంది అని నొక్కి చెబుతారుమహాత్మాగాంధీ. గ్రామ స్వరాజ్యం వర్ధిల్లిన నాడే అసలైన ప్రజాస్వామ్యం వెల్లివిరుస్తుందని విశ్వసించారు బాపు. స్థానిక పరిపాలనను సుస్థిరం చేయాలన్న మహాత్ముడి స్ఫూర్తితో 73, 74వ రాజ్యాంగ సవరణలూ జరిగాయి. తద్వారా పంచాయతీలకు, మున్సిపాలిటీలకు రాజ్యాంగపరమైన రక్షణ లభించింది. జాతిపిత కలలు నెరవేరాయి.
వ్యవసాయోత్సవం
కేసీఆర్ (సాగు పండుగ)
మూడుపూటలా తినడానికి సరిపడా గింజలు పండితే చాలనుకొనేది ఒకప్పటి తెలంగాణ. నేడు దేశానికే అన్నం పెట్టే స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నది. ఈ విజయం వెనుక.. కేసీఆర్ దార్శనికత, అకుంఠిత దీక్ష ఉన్నాయి. వ్యవసాయ రంగానికి బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రోత్సాహం అపారం. మద్దతు ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, పెట్టుబడి సాయం, పంటల ఎంపిక విషయంలో రైతులకు దిశానిర్దేశం.. మొత్తంగా, వ్యవసాయానికి కొత్త జవసత్వాలు తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్. ఫలితంగా.. ఒకప్పుడు ధాన్యం కొనుగోళ్లలో 14వ స్థానంలో ఉన్న రాష్ట్రం రెండో స్థానానికి ఎగబాకింది. పంజాబ్ తర్వాత అత్యధిక ధాన్యం ఉత్పత్తి, కొనుగోలు చేస్తున్నది మన గడ్డ.
నార్మన్ బోర్లాగ్ (కొత్త వంగడాలు)
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లమందిని ఆకలి నుంచి, పస్తుల నుంచి రక్షించిన వ్యక్తి నార్మన్ బోర్లాగ్. ఒకరకంగా ప్రపంచానికే అన్నదాత ఆయన. చీడపీడల్ని తట్టుకొని నిలబడి, అధిక దిగుబడులిచ్చే వంగడాలను ఆవిష్కరించడంపై దృష్టిసారించారు. 1960 ప్రాంతంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న భారత్, పాకిస్థాన్ దేశాల్లో ఆ వంగడాలను పరిచయం చేశారు. ప్రపంచవ్యాప్తంగా.. 20 కోట్ల పైచిలుకు ఎకరాలలో బోర్లాగ్ కనిపెట్టిన వంగడాలను వాడుతున్నారు. ఆ సేవలకు నోబెల్ శాంతి బహుమతి, పద్మవిభూషణ్ పురస్కారాలు వరించాయి.
అహింసా మార్గం
కేసీఆర్ (ప్రత్యేక రాష్ట్ర సాధన)
తెలంగాణ తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున కెరటమై లేచింది. కెరటంలానే పడిపోయింది. ఆత్మార్పణలు, బలిదానాలు జరిగినా..ప్రత్యేక రాష్ట్రం మాత్రం సాధ్యం కాలేదు. కేసీఆర్ నేతృత్వంలో మొదలైన మలిదశ పోరు ఆ స్వప్నాన్ని నిజం చేసింది. దీనికి కారణం ఆయన ఎంచుకున్న శాంతి మార్గం. ఆయన ధరించిన అహింసా ఆయుధం. పద్నాలుగేండ్ల పాటు కొనసాగిన ఈ సుదీర్ఘ ఉద్యమాన్ని శాంతియుత మార్గంలో నడిపించారు. సమాజంలోని అన్ని వర్గాలనూ ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని కుయుక్తులు పన్నినా.. కేసీఆర్ అహింసా రేఖను దాటలేదు, స్వరాష్ట్ర నినాదం ఆపలేదు.
తెలంగాణ సాధించేదాకా వదల్లేదు.
మహాత్మాగాంధీ (స్వాతంత్య్ర ఉద్యమం)
యావత్ భారతదేశాన్ని ఏకతాటిపై తెచ్చి.. స్వాతంత్య్ర పోరాటాన్ని మలుపుతిప్పారు గాంధీజీ. చంపారన్ సత్యాగ్రహం, సహాయ నిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా.. తదితర కార్యక్రమాల ద్వారా జాతి మొత్తాన్నీ స్వరాజ్య సాధన ఉద్యమం వైపు నడిపించారు. ఎక్కడా హింసకు తావివ్వలేదు. అంతిమంగా, గాంధీజీ గురి తప్పలేదు. అహింసా మార్గంలోనే స్వాతంత్య్రం సాధ్యమైంది. అహింసా పరమో ధర్మః అంటూ మహాత్ముడు ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు.
చట్టసభతో చుట్టరికం
కేసీఆర్ (ఆల్ టైమ్ రికార్డ్)
తెలుగు రాష్ర్టాల ఎన్నికల్లో ఎక్కువసార్లు గెలిచిన రికార్డు కేసీఆర్ పేరిటే నమోదైంది. పార్లమెంటు ఎన్నికలను మినహాయిస్తే.. అసెంబ్లీ ఎన్నికల్లోనే కేసీఆర్ 9 సార్లు గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా 1983 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కేసీఆర్ బరిలోకి దిగారు. కానీ, విజయం వరించలేదు. అయితే, 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. 1985, 1989, 1994, 1999, 2001, 2004 ఎన్నికల్లో వరుసగా ఆరుసార్లు సిద్దిపేట ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018, 2023 ఎన్నికల్లో గజ్వేల్ నుంచి గెలుపొందారు. 2004, 2009 ఎన్నికల్లో కరీంనగర్, మహబూబ్నగర్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, కేంద్రమంత్రిగా, ముఖ్యమంత్రిగా పనిచేశారు.
కరుణానిధి (ఓటమి ఎరుగని నేత)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ దివంగత ఎం కరుణానిధి పదమూడు ఎన్నికల్లో ఏకధాటిగా విజయం సాధించారు. 60 ఏండ్లలో ఒక్కసారి కూడా ఓటమిపాలు కాలేదు. 1954లో జరిగిన ఎన్నికల్లో కులితలై నియోజకవర్గంలో గెలిచిన కరుణానిధి.. ఆ విజయాల పర్వాన్ని 2016 వరకూ కొనసాగించారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా తమిళ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. కొంతమేర జాతీయ రాజకీయాలనూ ప్రభావితం చేశారు.
తాత ముద్ద
కేసీఆర్ (ఉచిత భోజనం, విద్య)
‘సర్కారు బడికి పోతే సక్కని సదువు చెబుతారు. కడుపునిండా కమ్మని బువ్వ పెడతారు’ అనే నమ్మకాన్ని తెలంగాణలోని తల్లిదండ్రులకు కల్పించింది కేసీఆర్ సర్కారే. పోటీ ప్రపంచంలో పిల్లలు నెగ్గుకువచ్చేలా పాఠశాలల్లో వసతులను మెరుగుపర్చారు కేసీఆర్. కాలానికి అనుగుణంగా డిజిటల్ విద్య ప్రవేశపెట్టారు. పిల్లలకు చదువులతో పాటు చక్కని పౌష్టికాహారం కూడా అందించేలా కార్యాచరణ రూపొందించారు. పాఠశాలల్లోనే బ్రేక్ఫాస్ట్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
కామరాజ్(మధ్యాహ్న భోజనం)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ను ‘మిడ్డే మీల్స్’కు ఆద్యుడుగా భావిస్తారు. పిల్లలకు పౌష్టికాహారం అందితేనే చదువు ఒంటపడుతుందని కామరాజ్ ప్రగాఢ విశ్వాసం.1956లో తిరునెల్వేలి జిల్లాలోని ఎట్టాయపురంలో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. ఆ నిర్ణయానికి అపూర్వ స్పందన వచ్చింది. దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకూ విస్తరించాలను కొన్నారు. కానీ, నిధుల కొరత అవరోధంగా మారింది. కేంద్రం సాయమూ పరిమితంగా ఉండేది. అయితే, ఈ సత్కార్యం ఆగిపోకూడదన్న ఉద్దేశంతో స్వచ్ఛంద సంస్థలు, దాతల నుంచి విరాళాలను సేకరించి మరీ పిల్లలకు అన్నం పెట్టారు. సీఎం హోదాలో ఉన్నప్పటికీ సామాన్యుడిలా విరాళాల కోసం జోలె పట్టారు కామరాజ్.
రెవెన్యూ సంస్కర్త
కేసీఆర్ (పాలనా దీర్ఘదర్శి)
అనేక పాలనా సంస్కరణలకూ నాంది పలికారు కేసీఆర్. కొత్త జిల్లాలు, మండలాలు, పంచాయతీలు ఏర్పాటు చేశారు. సమీకృత కలెక్టరేట్ భవనాలతో ప్రజల వద్దకే పాలన తెచ్చారు. నూతన పోలీసు కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రజాభద్రతను మెరుగుపర్చారు. ధరణి పోర్టల్ తీసుకొచ్చి పైరవీ, అవినీతికి తావులేకుండా చేశారు. కొత్తగా 76 పురపాలక సంఘాలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి స్థానిక సమస్యలకు సత్వర పరిష్కారాన్ని చూపారు. ఆస్తిపన్నులో రాయితీలు ప్రకటించారు. పరిపాలన, పంచాయతీరాజ్ శాఖలను బలోపేతం చేశారు.
మొదటి సాలార్ జంగ్ (పాలనా మార్గదర్శి)
నిజాంల పాలకవర్గంలో మొదటి సాలార్జంగ్కు (అసలు పేరు నవాబ్ తురబ్ అలీఖాన్) గౌరవనీయ స్థానం ఉండేది. హైదరాబాద్ రాజ్యం ఆర్థికంగా, పాలనాపరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో.. దివాన్గా బాధ్యతలు చేపట్టారు సాలార్జంగ్. అత్యంత సమర్థతతో పరిస్థితులను చక్కదిద్దారు. భూమిశిస్తు విధానంలో మార్పులు చేసి, సర్కారు ఆదాయాన్ని పెంచారు. రాజ్యాన్ని జిల్లాలు, సుబాలుగా విడగొట్టి చక్కటి పాలనకు మార్గం వేశారు. సుబాకు సుబేదార్, జిల్లాకు అవ్వల్ తాలూక్దార్ (కలెక్టర్), తాలూకాలో పన్నుల వసూలుకు తహసీల్దార్ను నియమించారు. సరికొత్త పోలీసు వ్యవస్థకు బీజాలు వేసి శాంతిభద్రతలు కాపాడారు. 1853-1883 మధ్య కాలంలో ఆయన ఆధునిక పాలన అంటే ఏమిటో చూపించారు.
గుండెల్లో గుడి
కేసీఆర్ (యాదగిరి వైభవం)
ప్రభుత్వ నిధులతో ఆలయాలను నిర్మించిన దాఖలాలు స్వతంత్ర భారత చరిత్రలోనే లేవు. తెలంగాణలో సీఎం కేసీఆర్ పాలనలోనే అది సాధ్యమైంది. యాదగిరి గుట్ట ఆలయాన్ని పునర్నిర్మించి భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టిన కేసీఆర్… వేములవాడ, కాళేశ్వరం, ధర్మపురి, బాసర, కొండగట్టు, భద్రాచలం.. ఇలా రాష్ట్రంలోని అన్ని ఆలయాలనూ దశల వారీగా అభివృద్ధి చేశారు. తొమ్మిదేండ్లలో రూ.2,800 కోట్ల నిధులు కేటాయించారు. ఆర్థికంగా అత్యంత వెనుకబాటుకు గురైన బ్రాహ్మణుల సంక్షేమానికి వివిధ పథకాల ద్వారా బీఆర్ఎస్ సర్కారు దాదాపు రూ. 212 కోట్లు ఖర్చు చేసింది.
వల్లభ్భాయ్ పటేల్ (సోమ్నాథ్ ఆలయం)
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన గుజరాత్లోని సోమ్నాథ్ క్షేత్రానికి దాదాపు రెండువేల ఏండ్ల చరిత్ర ఉంది. ముస్లిం పాలకుల దండయాత్రలతో జీర్ణావస్థకు చేరిన ఈ పురాతన ఆలయాన్ని తప్పకుండా పునర్నిర్మిస్తామని ఉక్కుమనిషి, భారత తొలి ఉప-ప్రధాని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన మూడు నెలలకే ప్రకటించారు. అయితే ఆలయం పునరుద్ధరించే అంశం రాజకీయంగా వివాదాలకు దారితీయొచ్చని అప్పటి ప్రధాని నెహ్రూ వారించే ప్రయత్నం చేశారు. అయినా వెనక్కి తగ్గలేదు. సోమ్నాథ్ ఆలయాన్ని అబ్బురపరిచేలా తీర్చిదిద్దారు.
వైద్యవిద్యకు పెద్దపీట
కేసీఆర్ (ఆరోగ్య తెలంగాణ)
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అని భయపడిపోయే పరిస్థితి నుంచి రాష్ర్టాన్ని ‘ఆరోగ్య తెలంగాణ’గా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే నాటికి మనకున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఐదు మాత్రమే. కేసీఆర్ హయాంలో 21 ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటు చేశారు. మరో ఎనిమిది కాలేజీల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. జిల్లాకో నర్సింగ్, పారామెడికల్ కాలేజీ స్థాపించే దిశగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏటా 10 వేల మంది వైద్యులను తయారుచేసే ‘డాక్టర్ల కార్ఖానా’గా తెలంగాణను మార్చారు.
విలియం బెంటింక్ (ఆసియాలో తొలి హాస్పిటల్ నిర్మాత)
ఆసియా మొత్తానికి తొలి వైద్య విద్యాలయమైన కలకత్తా మెడికల్ కాలేజీని 1835లో లార్డ్ విలియం బెంటింక్ కట్టించారు. ఆధునిక వైద్య పద్ధతులు, బోధనలను ఈ కాలేజీ అందుబాటులోకి తెచ్చింది. పొరుగు దేశాల విద్యార్థులూ వచ్చేవారు. బ్రిటిష్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయిన బెంటింక్ సంక్షేమంలో, విద్యారంగంలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నారు. విద్యాసంస్థలు, న్యాయస్థానాల్లో పర్షియన్ స్థానంలో ఆంగ్ల భాషను తీసుకొచ్చింది కూడాఈయనే. ఈ నిర్ణయం విప్లవాత్మకం.
హర్మ్యాల నగరం..
కేసీఆర్ (నిర్మాణ శిల్పి)
కలల తెలంగాణ పునర్నిర్మాణంలోనే కాదు.. కట్టడాల పునరుద్ధరణలో, కొత్త భవంతుల విషయంలో కూడా కేసీఆర్ అభిరుచి కనిపిస్తుంది. రాజసాన్ని ఒలకబోసేలా సెక్రటేరియట్ సౌధం, అమరవీరుల స్మారకం నిర్మించారు. అంతెత్తు అంబేద్కర్ విగ్రహాన్ని సాకారం చేశారు. నేరగాళ్లపై డేగకన్ను వేసే కమాండ్ కంట్రోల్ సెంటర్, సమీకృత కలెక్టరేట్ భవనాలు, కేబుల్వంతెనలు ఆయన వినూత్న ఆలోచనలే.
మీర్ ఉస్మాన్ అలీఖాన్ (హైదరా‘బాద్షా’)
హైదరాబాద్ రాష్ట్రంలో చారిత్రక కట్టడాల నిర్మాతగా నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ సుప్రసిద్ధులు. దక్కన్ ప్రాంతంలో తొలి దవాఖాన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ను కట్టించింది ఈయనే. మంచి ఆరోగ్య సేవలతోనే హైదరాబాద్ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని నిజాం నమ్మేవారు. హైదరాబాద్లోని ఎస్బీఐ, హైకోర్టు, బేగంపేట ఎయిర్పోర్టు నిర్మాత కూడా ఉస్మాన్ అలీఖానే. 1937నాటి ‘టైమ్’ మ్యాగజైన్ ఆయన్ని ‘ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్’ అని అభివర్ణించింది. నిజాం ఖజానాలో అపార నిధి నిక్షేపాలు ఉండేవి. వాటి విలువ రూ. 17.47 లక్షల కోట్లని ప్రస్తుత అంచనా.
కొత్తకు జాతర
కేసీఆర్ (బెస్ట్ ఇన్నోవేటర్)
కేసీఆర్ సమర్థుడైన పాలకుడే కాదు, ఉత్తమ ఆవిష్కర్త కూడా. కాబట్టే, ఐటీ కంపెనీల అవసరాలకు తగిన మానవ వనరులను సృష్టించడంతోపాటు యువతలోని ఆంత్రప్రెన్యూర్షిప్ను తట్టిలేపడమే ధ్యేయంగా టీ-హబ్, వీ-హబ్, ఐటీ-హబ్ వంటి ఐడియా కార్ఖానాలకు ఊపిరి పోశారు. యువత భవితకు హైదరాబాద్ భరోసా ఇస్తున్నదంటే కారణం కేసీఆర్ ముందుచూపే. బీఆర్ఎస్ పాలనలో తీసుకొన్న విప్లవాత్మకమైన నిర్ణయాల ఫలితంగా దిగ్గజ కంపెనీలు వరుస కట్టాయి. దేశంలో ప్రతి మూడు కొత్త ఉద్యోగాల్లో ఒకటి హైదరాబాద్ నుంచే వస్తున్నదని మానవ వనరుల నిపుణులూ చెబుతున్నారు. పాలకుడు ఆవిష్కర్త అయితేనే ఇలాంటి అద్భుతాలు సాధ్యం.
ఫ్రెడరిక్ టర్మన్ (ఫాదర్ ఆఫ్ సిలికాన్ వ్యాలీ)
ఆవిష్కరణలకు అడ్డాగా నిలిచే సిలికాన్ వ్యాలీ (అమెరికా) నిర్మాతగా ఫ్రెడరిక్ టర్మన్ పేరే చెబుతారు. వృత్తిరీత్యా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అయిన ఫ్రెడరిక్కు ఆవిష్కరణల పట్ల అంతులేని ఆసక్తి. ఆవిష్కర్తలైన యువతీయువకుల చేతుల్లోనే ప్రపంచ భవిష్యత్తు ఉన్నదని గ్రహించిన ఆయన.. నార్ద్రన్ కాలిఫోర్నియాలో (ప్రస్తుత సిలికాన్ వ్యాలీ) ఇన్నోవేటివ్ ప్రొగ్రామ్స్ నిర్వహించేవారు. విద్యార్థులకు పరిశోధనలపై ఆసక్తి కలిగించడానికి చిన్నచిన్న బహుమతులు ఇచ్చేవారు. యూనివర్సిటీ ఇచ్చే
కొద్దిపాటి వేతనాన్నీ దీనికే వెచ్చించేవారు. కాలక్రమేణా అక్కడ నాలెడ్జ్ సెంటర్ ఏర్పడింది. టెక్ అడ్డాగా మారింది. సిలికాన్ వ్యాలీగా ప్రసిద్ధిగాంచింది.
తెలుగు వెలుగులు
కేసీఆర్ (భాషా ప్రేమికుడు)
ఉద్యమకారుడిగా, రాజకీయవేత్తగా, దార్శనికుడిగా పేరుతెచ్చుకొన్న కేసీఆర్లో ఓ గొప్ప సాహితీవేత్త, తెలుగు భాషాభిమాని, రచయిత, కవి, వక్త ఉన్నారు. ఛలోక్తులు విసరడంలో ఆయన దిట్ట. అధ్యయన శీలి. 2017లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల ప్రారంభోత్సవంలో ఆయన చేసిన ప్రసంగం నభూతో. అమ్మ ఒడే మొదటి బడి అని, అమ్మ భాషే జీవన గమనానికి పునాది అనీ నమ్మిన వ్యక్తి ఆయన. కేసీఆర్ తెలుగు భాషా వికాసానికి ఎంతో కృషి చేశారు. పన్నెండో తరగతి వరకు తెలుగు తప్పనిసరి చేశారు. తన ప్రసంగాల్లో అమ్మ భాషలోని నుడికారాల్ని ముత్యాల్లా ఏరుకోవచ్చు. ప్రత్యర్థులకు సామెతలతో చురకలు అంటించడంలో దిట్ట. అవన్నీ సోషల్ మీడియాలో ట్రెండింగ్లోనే ఉంటాయి.
పీవీ నరసింహారావు (భాషోద్ధారకుడు)
తెలుగు భాష అభివృద్ధికి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కృషి అపారం, అనన్యం. భద్రిరాజు కృష్ణమూర్తితో కలిసి తెలుగు అకాడమీ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. అకాడమీకి తొలి చైర్మన్గానూ వ్యవహరించారు. అసెంబ్లీ సమావేశాల్లో తెలుగులోనే మాట్లాడి భాష ఔన్నత్యాన్ని ఇనుమడింపజేశారు. ఆనాటి నాయకుల్లో చాలామంది ఉర్దూలోనే విద్యను అభ్యసించారు. ఇప్పుడు ఇంగ్లిష్కు ఎంతటి ప్రాధాన్యం ఉందో.. అంత గుర్తింపు, గౌరవం తెలుగు ఉపాధ్యాయులకు ఉండేది. కాలక్రమేణా తెలుగు తన ప్రాభవాన్ని కోల్పోసాగింది. ఆ సంధికాలంలోనే పీవీ తెలుగు భాషాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. అందుకే, అకాడమీలతో అక్షరాలను దిద్దించి.. తెలుగు చదువులకు చలువ పందిళ్లు వేసిన భాషా స్వాప్నికుడిగా పీవీని అభివర్ణిస్తారు. సాహితీ తపస్విగానూ, కళా పిపాసిగానూ పీవీ చరిత్రకెక్కారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 9, 2024న‘భారతరత్న’ ప్రకటించి గౌరవించింది.
సంక్షేమ రాజ్యం
కేసీఆర్ (సంక్షేమానికి అగ్రస్థానం)
సీఎంగా ప్రమాణం చేసిన తొలిరోజు నుంచే కేసీఆర్ సబ్బండవర్గాల సంక్షేమానికి కృషిచేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా, గతంలో ఏ రాజకీయ పార్టీ చేపట్టని తీరులో కనీవినీ ఎరుగని రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు, అనాథలు, లింగమార్పిడి వ్యక్తులు.. ఇలా సమాజంలోని ప్రతీ వర్గానికీ ఏదో ఒక లబ్ధి చేకూర్చే పథకాలను రూపొందించారు. ఆసరా పించన్లు, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గురుకుల విద్యాలయాలు, సాగుకు ఉచిత విద్యుత్తు, గొర్రెల పంపిణీ, చేపల పంపిణీ, దళితబంధు, బీసీ-మైనార్టీలకు ఆర్థిక సాయం, డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ. 5కే భోజనం ఇలా దాదాపు 350కు పైగా సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా.. సమర్థంగా అమలు చేసిన ఘనత కేసీఆర్ది.
ఎన్టీఆర్ (పేదలకు పెద్దపీట)
తెలుగు రాష్ర్టాల రాజకీయాల్లో సంక్షేమ పథకాల ఆద్యుడిగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేరు చెబుతారు. సంక్షేమపథకాలకు కొత్త అర్థాన్ని ఇవ్వడమే కాదు.. వాటిని సమర్థంగా అమలు చేసి.. కాకలు తీరిన కురువృద్ధుల్నే ఆశ్చర్యపరిచారు.ఎన్టీఆర్ సంక్షేమ పథకాల లక్ష్యం ప్రజా క్షేమం ఒక్కటే. పేదవాడికి పథకంతో మేలు జరుగుతుందంటే చాలు.. దానివల్ల ఎన్నికోట్ల రూపాయలు ఖర్చుచేయడానికైనా వెనుకంజ వేసేవారు కాదు. సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత ఎన్టీఆర్ తీసుకొచ్చిన రూ.2కే కిలో బియ్యం పథకం, జనతా వస్ర్తాల పంపిణీ , అన్నం-సాంబారు పథకం (అన్న క్యాంటీన్లు), 5 లక్షల ఇండ్ల నిర్మాణం పథకం, పటేల్ పట్వారీ విధానం రద్దు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం తదితర కార్యక్రమాలు పేదల అభిమానాన్ని
చూరగొనడమే కాదు.. వారికి ఆర్థికంగా, సామాజికంగా ఎంతో భరోసానిచ్చాయి.
…? కడవేర్గు రాజశేఖర్