డాక్టర్ మీనా మహాజన్ను అభిమానులు ‘గురుమా..’ అని భక్తితో పిలుచుకుంటారు. జ్యోతిషం, యోగా, అష్టసిద్ధి ఆమె అభిమాన విషయాలు. పురాణాలు, ఉపనిషత్తులకు సైన్స్ జోడించి చెప్పడం ద్వారా యువతను ఆకట్టుకోవచ్చని అంటారు మీనాజీ. ‘మాడ్రన్ డే బ్రహ్మాస్త్ర’ పేరుతో ఆమె డిజైన్ చేసిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తున్నది. ‘ఎవరూ పుట్టుకతో మనుషులు కాదు. పుట్టిన తర్వాత.. చదువు, సంస్కారం, విలువలు, నిజాయతీతోనే నిజమైన మానవులుగా అవతరిస్తారు’ అని చెబుతుంటారు.
‘ఆధ్యాత్మిక మార్గంలోని ప్రత్యేకత ఏమిటంటే.. మనం సమస్యలుగా భావించే వేటికీ ఇందులో పరిష్కారం దొరకదు. కానీ, సాధన క్రమంలో ఆ సమస్యే కనిపించకుండా పోతుంది’ అంటారామె. శివ-శక్తి.. ఈ రెండూ సృష్టిని సమతౌల్యం చేస్తాయని విశ్వసిస్తారు గురుమా. కార్పొరేట్ సంస్థల నుంచి ఆధునిక విశ్వవిద్యాలయాల వరకూ.. ఆమె అనుగ్రహభాషణం చేయని వేదికంటూ లేదు. వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలనూ నిర్వహిస్తున్నారు. ఆమె వారణాసిలో పుట్టారు. అక్కడే చదువుకున్నారు.