ముద్దపప్పు వాయలో పచ్చిపులుసు చిలకరించుకుంటే రెండు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం! మటన్ బిర్యానీకి చికెన్ 65తో దోస్తీ కుదురుతుంది. అలాగని ప్రతి రుచినీ మరింత ఆస్వాదించడానికి సరైన జోడీ ఉంటుందనుకుంటే పొరపాటు. కొన్ని కాంబినేషన్లు మన టాలీవుడ్ సినిమాల్లా ఊహించనంతగా బెడిసికొడతాయి. ఈ తరహా జంట పదార్థాలను ఆయుర్వేదం విరుద్ధ ఆహారంగా పేర్కొంటున్నది. మధ్యాహ్న భోజనంలో తిన్న పదార్థాలను బట్టి సాయంత్రం ఏం తినకూడదో కూడా సూచించింది. ఉదాహరణకు లంచ్లో వేడివేడి కిచిడీ లాగించేశారే అనుకోండి.. ఆ సాయంత్రం పాలు తాగొద్దని ఆహార నిపుణుల మాట. రకరకాల కూరగాయలతో వండిన కిచిడీ అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది.
అది పూర్తిస్థాయిలో జీర్ణం కాకముందే చిక్కటి పాలు గుటకేస్తే.. జీవక్రియ మరింత మందగిస్తుందన్నమాట! గుడ్లు, చేపలతో కూడిన వంటకాలు తిన్నప్పుడు బీన్స్కు దూరంగా ఉండమని సూచించారు. అంతేకాదు, ఈ వెరైటీలు ఆస్వాదించినప్పుడు గడ్డపెరుగు వేసుకోకపోవడమే మంచిదట. అంతగా కావాలనుకుంటే మజ్జిగతో చివరి వాయ ముగించొచ్చు. గుడ్ల వంటకాల్లో చీజ్ లేకుండా జాగ్రత్తపడాలి. కొవ్వు పదార్థాలను, ప్రొటీన్ ఆహారాన్ని కలగలిపి చేసే వంటకాల వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. జిహ్వ చాపల్యం కొద్దీ ఇలాంటి వెరైటీలు తరచూ తింటూపోతే అనారోగ్య సమస్యలూ తలెత్తవచ్చు. అందుకే, ఒక్కో పదార్థానికీ నిర్దిష్టమైన జోడీ ఉంటుందని గ్రహించి, రుచిగా వండుకొని తినేయండి.