జీవితాంతం అనారోగ్య సమస్యలు లేకుండా ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే, అన్ని అనారోగ్య సమస్యలకు ఔషధాలు అక్కర్లేదు. కొన్ని సమస్యలకు చిన్నచిన్న చిట్కాలే చక్కటి పరిష్కారం చూపిస్తాయి. సమస్యను బట్టి వంటింటి పదార్థాలు, పండ్లు, కూరగాయలు పరిష్కారానికి తోడ్పడుతాయి. ఔషధం అక్కర్లేని అనారోగ్య సమస్యల్లో మలబద్ధకం కూడా ఒకటి. ఈ సమస్యకు అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
అరటిపండులో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు సులభంగా జీర్ణం కూడా అవుతుంది. అందుకే డాక్టర్లు రోజూ ఒక అరటిపండు తినాలని సూచిస్తుంటారు. ఈ పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇవీ ప్రయోజనాలు..
1. అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి ఎముకలు, దంతాలకు చాలా మంచిది. శరీర కండరాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
2. ఈ పండులో ఉండే పోషకాలు ఆస్తమా, అధిక రక్తపోటు, క్యాన్సర్ నివారణలో కూడా తోడ్పడుతాయి.
3. కిడ్నీల ఆరోగ్యానికి కూడా అరటిపండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వారానికి రెండు లేదా మూడు అరటిపండ్లు తినడంవల్ల కిడ్నీ సంబంధిత జబ్బుల బారినపడే ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
4. అరటిపండులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. అందుకే మలబద్ధకానికి ఇది మంచి మందు.
5. ఈ పండులో కొవ్వులు తక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచిది. ఇందులో ఉండే పిండిపదార్థం కడుపు నిండిన భావన కలిగించి, ఆకలిని తగ్గిస్తుంది.
6. అంతేగాక అరటి పండు పేగులను ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
7. అరటి పండులో ఉండే ‘బాన్లెక్’ అనే రసాయనానికి ఎయిడ్స్ వైరస్పై పోరాడే శక్తి ఉందని ఓ రిసెర్చ్లో తేలింది. ప్రస్తుతం ఈ వైరస్ నిరోధానికి వాడుతున్న ‘టీ20, మారావిరాక్’ మందులతో సమానంగా ఈ రసాయనం పనిచేస్తుంది. లెక్టిన్ రసాయనం వైరస్ను శరీరంలో ప్రవేశించకుండా అడ్డుకుని ఇన్ఫెక్షన్ను నిరోధిస్తుంది.
8. అదేవిధంగా అరటి పండులో ఉండే ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్గా మారుతుంది. తద్వారా ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ప్రశాంతతను కలుగజేస్తుంది. రాత్రిపూట పాలతో కలిపి అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది.