పిల్లలతో ముందుగా అక్షరాలు దిద్దించాలి. ఆ తర్వాత రాయడం నేర్పాలి. కూడబలుక్కుని చదవడం మొదలుపెట్టగానే బొమ్మల పుస్తకాలు పరిచయం చేయాలి. దీనివల్ల వారి పదకోశం పెరుగుతుంది. ఆలోచన విస్తరిస్తుంది. శతాబ్దాల వెనక్కి వెళ్లనవసరం లేదు. ఓ నలభై ఏళ్ల కాలప్రయాణం సరిపోతుంది. సీరియల్స్ చదివేందుకు వారపత్రికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన రోజులవి. పుస్తక పఠనాన్ని దినచర్యలో భాగంగా మార్చుకున్న తరమది. ప్రతి ఊళ్లో గుడి, బడి, దవాఖానతో పాటు గ్రంథాలయం కూడా ఉండేది. రోజులు మారాయి. ఇప్పుడంతా డిజిటల్మయం. ఏదైనా అనుమానం వస్తే, నివృత్తి ఎన్సైక్లోపీడియాలోని ఏ వాల్యూమ్లో ఉందో చూడాల్సిన పన్లేదు. చూపుడు వేలుతో మొబైల్ స్క్రీన్ తడిమితే చాలు.
గ్రంథాలు, శాస్ర్తాలు.. ఇప్పుడన్నీ డిజిటల్ పుస్తకాల రూపంలో అందుబాటులో ఉంటున్నాయి. కొనాల్సిన ఖర్చు లేదు. మోయాల్సిన బరువు లేదు. దాచాల్సిన శ్రమ లేదు. ఇంకా మాట్లాడితే చదవాల్సిన అవసరం కూడా లేకుండా ఆడియో బుక్స్ వచ్చేశాయి. ఇదంతా సులువుగా కనిపిస్తుందేమో కానీ, ఓ విలువైన అనుభవాన్ని కోల్పోతున్నామని అంటున్నారు నిపుణులు. పుస్తకం మన చేతిలో ఉన్నప్పుడు కలిగే శ్రద్ధ వేరు, పేజీలను తాకుతూ కాగితపు వాసనతో మమేకమై ఒక్కో అక్షరాన్నీ మనసులో నింపుకొనేటప్పుడు… కలిగే ఫలితం, అనుభూతి డిజిటల్ తెర మీద కదిలిపోయే అక్షరాలు అందించలేవని తేల్చేశారు. ప్రతి పుస్తకం ఓ కనిపించని జీవితాన్నీ, సుదూర లోకాన్నీ కళ్లకు కడుతుందని చెబుతున్నారు. అందుకే తల్లిదండ్రులు ఇప్పటి తరానికి అచ్చు పుస్తకాలను పరిచయం చేయాలని సూచిస్తున్నారు. తప్పక ప్రయత్నిద్దాం. తొలుత ఒక పుస్తకంతో ప్రయోగం మొదలుపెడదాం. తర్వాత ఆ సంద్రంలో మునకలేయిద్దాం.