ఈ రోజుల్లో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఈ తరం పిల్లల్లో చాలామంది హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు. మరికొందరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంటారు. పదిమందిలో ఉన్నా.. నిశ్శబ్దంగా తమ పనిలో తాము నిమగ్నమవుతుంటారు. ఇలాంటి పిల్లలను అలాగే వదిలేస్తే.. పెద్దయ్యాక వారిలో ఆత్మన్యూనతా భావం పెరిగిపోతుంది. చొచ్చుకుపోయే స్వభావం లేకుడా పోతుంది. అలా జరుగొద్దంటే ఈ టిప్స్ పాటించండి..
పిల్లలు నిరంతరం చదువులు, ఆటల్లో మునిగిపోకుండా ఇంటిపనిలో భాగం చేయాలి. వారికి చిన్న చిన్న పనులు నేర్పుతుండాలి. పనిచేసే క్రమంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఇది వాళ్ల మానసిక ఎదుగుదలకూ దోహదం చేస్తుంది. పనిచేసే క్రమంలో పిల్లలను గమనించడం ద్వారా వారి మానసిక స్థితిగతులను, భావోద్వేగాలనూ తెలుసుకునే వీలు ఉంటుంది.
పిల్లలకు వారి అనుభవాల ఆధారంగా కథలు చెప్పడం నేర్పించాలి. దీనివల్ల వారి జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. వారిలోని లోపాలను వారు అధిగమించగలుగుతారు. పిల్లలు సరిగ్గా కమ్యూనికేట్ చేయడానికి, ఎమోషనల్ డెవెలప్మెంట్ కోసం.. తల్లిదండ్రులు పిల్లలతో ఆరోగ్యకరమైన, దృఢమైన బంధాన్ని ఏర్పరచుకోవాలి.
పిల్లలు ఏవైనా ప్రశ్నలు అడిగినపుడు విసుగు తెచ్చుకోకుండా, సమాధానాలు చెప్పటం వల్ల వారికి కొత్త విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం పెరుగుతుంది. వాళ్లు కొత్త విషయాలు తెలుసుకుంటున్న కొద్దీ వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏమైనా అడిగినపుడు తిట్టి, కొట్టి నిశ్శబ్దంగా కూర్చోబెడితే వారు ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతారు. ఇది అలాగే కొనసాగితే వారి అభివృద్ధికి మీరే అడ్డుతగిలినట్టు అవుతుంది.