జీవన నాణ్యత ఎంత ముఖ్యమో.. మరణం కూడా అంతే ముఖ్యమైనది. మంచి జీవితాన్ని గడిపిన తర్వాత శ్వాస కూడా సులభంగా ఆగిపోతుందని మనమందరం ఆశిస్తుంటాం. అయితే, ఇది ఎక్కువ ఆదాయం ఉన్న దేశాల్లో నివసించే ప్రజల విషయంలో మాత్రమే నిజమవుతున్నది. తక్కువ ఆదాయ దేశాల ప్రజలకు హాయిగా చావడం కూడా కలగానే మిగిలిపోతున్నది. ఇలా ఎందుకు జరుగుతుందనే దానిపై శాస్త్రవేత్తలు ఇటీవలే క్వాలిటీ ఆఫ్ డెత్ అండ్ డైయింగ్ ఇండెక్స్-2021 ద్వారా సమాధానం ఇచ్చారు.
అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో ప్రపంచవ్యాప్తంగా 81 దేశాలకు ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ ఆధారంగా ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ గ్రేడ్లు ఇచ్చారు. ఆశ్చర్యకరంగా ఈ నివేదికలో 6 దేశాలు మాత్రమే ఏ గ్రేడ్ను పొందగా… 21 దేశాలకు ఎఫ్ గ్రేడ్ లభించింది. భారతదేశం డీ గ్రేడ్తో 59వ స్థానంలో ఉండగా.. చైనా, రష్యా, గ్రీస్, ఇండోనేషియా, చిలీ, జార్జియా, వియత్నాం, మెక్సికోలు కూడా డీ గ్రేడ్ను పొందాయి. అమెరికా సీ గ్రేడ్తో 43వ స్థానంలో నిలిచింది. అమెరికాతో పాటు కొలంబియా, మయన్మార్, మెక్సికో, థాయిలాండ్, ఈజిప్ట్, ఘనా, ఇజ్రాయెల్, ఉగాండా, డెన్మార్క్, నైజీరియా వంటి దేశాలు కూడా సీ గ్రేడ్లో ఉన్నాయి.
ఈ సూచికలో యునైటెడ్ కింగ్డమ్ మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు ఐర్లాండ్, తైవాన్, కోస్టారికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా కూడా ఏ గ్రేడ్ సాధించాయి. ఈ దేశాలలో నివసిస్తున్న ప్రజలు వారి చివరి రోజుల్లో మంచి శారీరక, మానసిక సంరక్షణ పొందుతున్నట్లు నివేదిక వెల్లడించింది.
పరాగ్వే 81వ స్థానంలో నిలిచింది. అంటే ఇక్కడి ప్రజలు ప్రశాంతంగా తుది శ్వాస విడవలేకపోతున్నారు. బంగ్లాదేశ్, లెబనాన్, హైతీ, బ్రెజిల్, సెనెగల్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, అర్మేనియా, అర్జెంటీనా, నేపాల్, సూడాన్, మలేషియా, ఇథియోపియా, ఇరాక్ దేశాలు ఎఫ్ గ్రేడ్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.