రామచంద్రుడు పున్నమి చంద్రుడిలా వెలిగిపోయాడు. అయోధ్య కౌసల్యమ్మలా మురిసిపోయింది. కొత్త కోవెలకు దీపావళి పండుగొచ్చింది. బంగారమంటి ఆ సన్నివేశాన్ని బంగారంలోనే పొదగాలనుకున్నారు డిజైనర్లు. ఆ వైభవానికి వన్నె తెచ్చేలా పసిడి జిలుగుల్ని తీర్చిదిద్దారు. అయోధ్య రామ మందిరం థీమ్తో వచ్చిన నగలు భక్తులకు చిరకాల జ్ఞాపికలు.
పసిబిడ్డకు గాలీధూళీ సోకకుండా.. ఆంజనేయుడి రూపు మెడలో కడతాం. పెద్దయ్యాక జైశ్రీరాం… గొలుసులూ, ఉంగరాలూ వేస్తాం. మనం కొలిచే దేవతల పేర్లు, వలచే వ్యక్తుల పేర్ల్లు…ఇలా ఎన్నో ఆభరణాలుగా మార్చి అలంకరించుకుంటాం. వాటిని చూడగానే మదిలో ఒక మధురానుభూతి మెదులుతుంది. ఇటీవల అచ్చం అలాంటి అనుభూతినే ఆస్వాదించింది భారతదేశం. రాముడికి గుండెల్లోనే గుడికట్టుకున్న వాళ్లు కూడా.. కళ్లముందు కనిపిస్తున్న మందిరాన్ని మదిలో మళ్లీ ప్రతిష్ఠించుకున్నారు. అంతటి ఆనంద క్షణాలను మరిచిపోతే ఎలా.. విలువైన ఆ జ్ఞాపకాలను మనసు పొరల్లోనే దాచేస్తే ఎలా.. అందుకే సుందర మందిరాన్నీ ఆభరణాల్లో పొందుపరిచారు. జగదభిరాముడి కోవెలను పోలిన ఈ నగలు జయపతాకతో సహా దర్శనమిస్తూజనం జేగంటలు అందుకుంటున్నాయి.
బాలరాముడి భవ్య మందిరాన్ని శిల్పులు ఎంత ఏకాగ్రతతో నిర్మించారో… ఈ నగలనూ అంతే శ్రద్ధతో తీర్చిదిద్దుతున్నారు తయారీదారులు. ఆలయ గోపురాలు, ద్వారాలు, చుట్టూ ఉండే మండపాలకు చూడచక్కటి నగిషీలు అద్దుతున్నారు. ఇంపైన ప్రాకారాలను సొంపైన కెంపులతో అలంకరిస్తున్నారు. పసిడి వెలుగులకు పచ్చల సొబగులద్దుతున్నారు. ముద్దుగొలిపే ముత్యాలను ముచ్చటగా వేలాడదీస్తున్నారు. వజ్రపు కాంతుల్నీ జోడిస్తున్నారు. హారాలు, నెక్లెస్లు, లాకెట్ల రూపాల్లో మెడలో ధరించేలా అందంగా రూపొందిస్తున్నారు. ఒక సంస్థ అయితే ఏకంగా నగలోనే రామాయణ ఘట్టాలను పొందుపరిచింది. పాలబుగ్గల బాల రాముడు నగలతో ముస్తాబైన ఫొటో ఇటీవల వైరల్ అయినట్టే, రామ మందిరం నగలు కూడా నలుగుర్నీ ఆకట్టుకుంటున్నాయి.