ఈ రోజుల్లో ఉదయం లేచింది మొదలు సాంకేతికత పరిజ్ఞానంతో పయనిస్తున్నాం. మానవాళి మనుగడను మరింత సులభతరం చేసేందుకు సృష్టించిన అత్యాధునిక సాంకేతికత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ). ఇప్పటికే ప్రతి అంశంలోనూ మనిషికి చేదోడు వాదోడుగా మారిపోయిన కృత్రిమ మేధ.. ఇప్పుడు మరో సాయానికి సిద్ధపడుతున్నది. మనుషుల వ్యవహార శైలిని పసిగట్టి, ఆత్మహత్య ఆలోచనలు కలిగితే ముందుగానే అంచనా వేస్తున్నదని తాజా అధ్యయనంలో తేలింది!
యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్వేల్స్ సిడ్నీకి చెందిన పరిశోధకులు దీనికోసం కొత్త మెషీన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ను ఉపయోగించి మంచి ఫలితాలను పొందారు. ఇప్పటికే ఉన్న ఏఐ రిస్క్ ప్రెడిక్టర్లకంటే.. ఈ లేటెస్ట్ మోడల్స్ కచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నాయట. దీనివల్ల పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ వారి మానసిక స్థితిని గుర్తించి ముందుగానే హెచ్చరించొచ్చని అంటున్నారు పరిశోధకులు. చిన్నపిల్లల నుంచి యువతీయువకుల వరకూ 2,809 మందికి సంబంధించిన డేటాను పరిశీలించిన రీసెర్చర్స్ లాంగిట్యూడినల్ స్టడీ ఆఫ్ ఆస్ట్రేలియన్ చిల్డ్రన్ సంస్థ పలు వివరాలు సేకరించింది.
ఇందులో 14-15 ఏండ్ల, 17-27 ఏండ్ల మధ్య వయసున్న వారిని ఎంపికచేసి రెండు గ్రూపులుగా విభజించారు. వారి ప్రవర్తన, వ్యవహార శైలికి సంబంధించి తల్లిదండ్రులతోపాటు ఉపాధ్యాయుల నుంచి కొన్ని ముఖ్యమైన వివరాలు రాబట్టారు. వాటిని మానసిక వైద్యులు పరిశీలించారట. ఆ సమాచారాన్ని ఏఐ అల్గారిథమ్స్ను ఉపయోగిస్తూ విశ్లేషించారు. ఈ క్రమంలో మొత్తం వ్యక్తుల్లో 10.5 శాతం మంది తమకు తాము హాని చేసుకున్నట్లు తేలింది. 5.2 శాతం మంది గడిచిన సంవత్సర కాలంలోనే కనీసం ఒక్కసారైనా ఆత్మహత్యకు యత్నించినట్టు తేలింది. దీంతో కొత్త ఏఐ రాండమ్ అల్గారిథమ్ మోడల్స్.. ఇలాంటి విషయంలో కచ్చితమైన సమాచారాన్ని అందిస్తున్నాయని నిర్ధారణకు వచ్చారు పరిశోధకులు. దీని సాయంతో కుంగుబాటుకు గురైన వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడకుండా కాపాడొచ్చని చెబుతున్నారు.