Health News | శారీరక అనారోగ్యం కంటే మానసిక అస్వస్థత చాలా ప్రమాదకరమైనది. మానసిక సమస్యలు ఎదుర్కొనేవారిలో ఆత్మవిశ్వాసం, నమ్మకం, ధైర్యం, భవిష్యత్తుపై ఆశలు సన్నగిల్లుతాయి. తద్వారా వారిలో ఆత్మహత్య ఆలోచనలు రేకెత్తుతాయి. కరోనా తర్వాత ప్రపంచవ్యాప్తంగా 25.6 శాతం మంది మానసిక ఆందోళనతో కాలం వెళ్లదీస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది.
18-30 ఏండ్ల మధ్య వయసున్నవారు ఎక్కువ ఆందోళన చెందుతున్నారని సర్వేల సారాంశం. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులపై అమెరికా శాస్త్రవేత్తలు తాజాగా చేసిన అధ్యయనం ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. వీరి పరిస్థితికి సోషల్ మీడియా, ఆర్థిక పరిస్థితులు ప్రధాన కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చెదిరిన మనసుకు ధైర్యం చెప్పుకోలేక… ఆత్మహత్యకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. మానసిక సమస్యల నుంచి బయటపడేందుకు యోగ, వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవాలని మానసిక వైద్యులు సూచిస్తున్నారు.