దైనందిన జీవితంలోని దాదాపు అన్ని అంశాలూ టెక్నాలజీని అందిపుచ్చుకున్నట్టే.. జర్నలిజం కూడా అత్యంత వేగంగా డిజిటలైజ్ అవుతున్నది. నెట్వర్క్ జనరేషన్ మారేకొద్దీ.. న్యూస్ జనరేషన్కు మిల్లీసెకండ్ల సమయం కూడా ఎక్కువే అనిపి స్తున్నది. ఢిల్లీ ముచ్చట మరుక్షణం గల్లీలో వైరల్ అవుతున్నదంటే.. జర్నలిజంలో టెక్నాలజీ పాత్ర ఎంత పెరిగిందో ఊహించుకోవచ్చు. అయితే, ఈ సాంకేతిక యుగంలో వేలం వెర్రిగా పుట్టుకొస్తున్న డిజిటల్, సోషల్ మీడియా చానెళ్లు జర్నలిజం విలువలను హ్యాక్ చేసి పబ్బం గడుపు కొంటున్నాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి.
Tek Talk | పాత్రికేయ వృత్తి ఒకప్పటిలా ఇప్పుడు సంక్లిష్టంగా లేదు. వార్త సేకరణ, ప్రసారం వరకు అడుగడుగునా డిజిటల్ ఇంటెలిజెన్స్ అండగా నిలుస్తున్నది. సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ మీడియా ప్లాట్ఫాంలు రాజ్యమేలుతున్నాయి. సంప్రదాయ ప్రసార మాధ్యమాలను తోసిరాజని వీటి హవా నడుస్తున్నది. చేతిలో ఫోన్, ఫోన్లో యూట్యూబ్ అకౌంట్ ఉంటే చాలు.. వాక్చాతుర్యం ఉన్న ప్రతి వ్యక్తీ మీడియా అధినేతగా మారిపోతున్నాడు. కానీ, ఈ డిజిటల్ ప్రవాహంలో నికార్సైన నిజాలు.. అబద్ధాలైపోతున్నాయి, అచ్చమైన అబద్ధాలు.. పచ్చి నిజాలుగా చెలామణీ అవుతున్నాయి. అయితే, డిజిటల్ ఇంటెలిజెన్స్ను సక్రమంగా వినియోగించుకుంటే సరైన సమాచారాన్ని ప్రజలకు త్వరగా, మరింత కచ్చితత్వంతో అందించే అవకాశాలు ఉన్నాయి.
– అనిల్ రాచమల్ల వ్యవస్థాపకులు ఎండ్నౌ ఫౌండేషన్