‘రైతుబంధు, రైతు బీమా, రైతులకు ఉచిత విద్యుత్, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్’ వంటి పథకాలకు పురుడుపోసింది తెలంగాణ రాష్ట్రం. ప్రతి పథకంలోనూ ప్రజల కష్టాలు తీరాలన్న కేసీఆర్ తపన దాగి ఉంది. అయితే ఈ మొత్తం పథకాల్లో ఆరు ప్రధానమైనవిగా చెప్పవచ్చు.
రైతు బంధు: రైతుల స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు వంటి వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకాన్ని కేంద్రంతోపాటు రాష్ర్టాలు సైతం ఆదర్శంగా తీసుకొని అమలుచేస్తున్నాయి. ఈ పథకంపై అంతర్జాతీయ సంస్థలు ప్రశంసలు కురిపించాయి. ఇలా వేల కోట్ల రూపాయలను రైతుల క్షేమం కోసం, వ్యవసాయాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపెడుతున్నది.
రైతు బీమా: రైతులు బతికుండగానే పట్టించుకోని ప్రభుత్వాలను చూశాం. మరణించిన తర్వాత కూడా రైతు కుటుంబాలకు అండగా ఉండాలనే ఆలోచన చేసింది తెలంగాణ ప్రభుత్వం. రైతు మరణిస్తే ఆ కుటుంబం అనాథగా మిగలవద్దని ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని రైతు బీమా పథకానికి రూపకల్పన చేసింది రాష్ట్ర సర్కార్. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వయస్సున్న వారందరికి వర్తించేలా రూపొందించింది. ఈ పథకం ద్వారా మరణించిన రైతు కుటుంబానికి రూ.5 లక్షలను 15 రోజుల్లో అందించే ఏర్పాటుచేసింది.
రైతులకు ఉచిత విద్యుత్: పంటపొలాలు పచ్చగా ఉండాలంటే అందుకు కరెంటు కావాలి. కరెంటు కావాలని అడిగిన రైతులను గత ప్రభుత్వాలు కాల్చివేసిన సందర్భాలున్నాయి. కరెంటు లేక పంటలు దెబ్బతిని అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదే దుస్థితి స్వరాష్ట్రంలో రైతులకు రాకూడదని రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటును అందిస్తున్నది.
మిషన్ భగీరథ: మంచినీళ్ల కోసం మైళ్ల దూరం నడిచిన కష్టాలు మనవి. బిందెడు నీళ్ల కోసం రోజంతా బోరింగుల వద్ద బారులు తీరిన సందర్భాలున్నాయి. స్వరాష్ట్రంలో మంచినీటి కష్టాలు పోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు.
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్: ఆడబిడ్డ పెండ్లి కోసం ప్రభుత్వమే ఆర్థిక సాయం చేసే అద్భుత పథకానికి తెలంగాణ జీవం పోసి దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రకుల పేదల కోసం అందరికి సమానంగా వర్తించేలా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని తీసుకువచ్చింది. బిడ్డ పెండ్లి చేసిన తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా లక్షా నూట పదహారు రూపాయలను ప్రభుత్వం అందిస్తున్నది. కరోనా లాంటి మహమ్మారి సమయంలో కూడా ఈ పథకాన్ని కొనసాగించడం హర్షణీయం.
ఆసరా పింఛన్లు: ఏ ఆధారం లేని వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వమే ఆధారమైంది. వృద్ధులు, ఒంటరివాళ్లు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థుల కోసం ఆసరా పింఛన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నది. రూ.200 ఉన్న పింఛన్ను రూ.2016కు పెంచింది. దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ను రూ.3016కు పెంచింది. ఆర్థికంగా తీవ్రభారం పడినా ఈ పథకాన్ని ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఈ ఆరు పథకాలే కాకుండా ప్రజల సంక్షేమం, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అనేక పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్నది. దేశంలో ఇలాంటి పథకాలు తీసుకువచ్చిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని గట్టిగా చెప్పగలం.