నాన్న ట్యాక్స్ ఆఫీసర్. అమ్మ స్టాఫ్ నర్స్. అక్క లెక్చరర్. తమ్ముడు డాక్టర్. మరి, నువ్వేం అవుతావ్? అని అడిగారు. ఆమె కళను ప్రేమించింది. జానపదమే ప్రాణంగా బతికింది. పాటనే కెరీర్గా ఎంచుకుంది. ఇప్పుడు, వాళ్లంతా సగర్వంగా చెప్పుకొనే గాయని.. అమూల్య కోటి.
‘పాట తనకు ప్రాణం పోసిందని’ అంటున్నది అమూల్య. తనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి, ఓ గుర్తింపు రావాలన్న లక్ష్యంతో నాలుగో తరగతినుంచే జానపదాన్ని కెరీర్గా భావించింది. తనలా పాటను ప్రేమించే వాళ్లకు ఓ దారి చూపిస్తున్న అమూల్య కోటి మనసులోని మాట..
మా నాన్న కోటి వెంకటేశ్వర్లు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. అమ్మ రాజమణి స్టాఫ్ నర్స్. నాకు ఒక అక్క, తమ్ముడు. మాది హుస్నాబాద్. తాత, నాయినమ్మ, అమ్మ, నాన్న మాకు చిన్నప్పుడు కథలు, మహనీయుల చరిత్రలు చెప్పేవాళ్లు. తెలంగాణ చరిత్ర, గొప్పదనం బాల్యంలోనే తెలిసింది. ఇంకా తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. అదే నన్ను కళలవైపు తీసుకెళ్లింది. ‘పెద్దగైనంక ఏమైతరు?’ అని టీచర్లు అడిగితే డాక్టర్, కలెక్టర్, ఇంజినీర్ అని అంతా అంటుంటే, నేను మాత్రం రచయిత, కళాకారిణి, గాయని అంటూ చెబుతుండేదాన్ని.
నేను నాలుగో తరగతిలో ఉండగా ఒకసారి పాటల పోటీలు పెట్టారు. తోటి విద్యార్థులు సినిమా పాటలతో అలరిస్తున్నారు. నానుంచి కూడా సినిమా పాటనే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. కానీ, నేను జానపదం పాడాను. అందరూ ఆశ్చర్యపోయారు. నాకు సామాజిక, జానపద పాటలపై ఉన్నంత ఆసక్తి, సినిమా పాటలపై లేదు. కాబట్టే, పాడలేను. అంత మంచి వేదికపై సినిమా పాటలు కాకుండా జానపద పాటలు ఎంచుకోవడం అందరికీ వింతగా అనిపించి ఉండొచ్చు. అందుకే, ‘హే పిల్లా.. సీన్మ పాటలు లెవ్వా. గా ముసలోల్లు పాడుకునే పాటలు ఎంచుకున్నవ్’ అని నాతోటి అమ్మాయిలు అనేవాళ్లు.
స్కూల్లో అన్ని కాంపిటీషన్స్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ వెళ్తున్న నన్ను మా తెలుగు సార్ ‘ఏమమ్మా అమూల్యా! పాటలపై పెట్టే కాన్సెంట్రేషన్లో సగమైనా చదువులపై పెట్టు. మంచి మార్కులు వస్తయి’ అన్నరు. ఎంత చెప్పినా నేను మాత్రం పాటలకే ప్రాధాన్యం ఇవ్వడంతో ఆ సారే మండలస్థాయి పోటీలకు తీసుకెళ్లిండ్రు. మా నాన్నమ్మ దగ్గర సేకరించిన పాటను పాడిన. కేరింతలతో వేదికంతా దద్దరిల్లింది. ‘నేను ఏందో అనుకున్నా. నువ్వు చాలా బాగ పాడుతున్నవ్. మంచి సింగర్వి అవుతావు’ అని సార్ మెచ్చుకున్నరు.
వాస్తవానికి మా ఇంట్లో నాకంటే ముందు సింగర్ మా అక్క స్రవంతి. ఆమెను చూసే నేను పాటలవైపు మళ్లిన. అక్కే నాకు పాడటం నేర్పించింది. అందుకే ఆమెనే నా గురువు. ఆమె సీరియస్గా పాడుతున్నప్పుడు నేను సరదాకోసం పాడిన. ఇప్పుడు నేను సీరియస్గా తీసుకొన్నా, ఆమె సరదాగా పాడుతుంది. అక్క చదువులపై ఎక్కువగా దృష్టి పెట్టి అటువైపు వెళ్లింది. నేనేమో కళారంగంలోనే ఉండిపోయాను. చాలామంది అంటుండే వాళ్లు ‘అమ్మా, నాన్న బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్లకంటే మంచి పొజిషన్లో ఉండాలిగానీ ఈ పాటలేంది?’ అని. ఇంట్లోవాళ్లు కూడా మొదట్లో అన్నారు. కళలకు అంకితమవ్వడం వల్ల చదువు పెద్దగా అబ్బలేదు.
ఎక్కడ వేదిక దొరికితే అక్కడ పాడుతున్నాను. నా గొంతు వినిపిస్తున్నాను. అందరూ మెచ్చుకుంటున్నారు. కానీ, ‘నేను నేర్చుకున్నది సంగీతం కాదు. జానపదాలు, సామాజిక గీతాలనే ఎంచుకున్నాను. అవకాశాలు ఉంటాయా?’ అని. ‘ఏం చేస్తున్నావ్’ అని ఎవరైనా అడిగితే, ‘జానపద పాటలు పాడుతా’ అని చెప్తే ఏమనుకుంటరో అనిపించింది. ‘అనవసరంగా చదువుల్ని వదులుకున్నానా?’ అని తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో తెలంగాణ ఉద్యమం నాకొక అవకాశంగా దొరికింది. ఉద్యమకారులు, గాయకులతో కలిసి పాడిన. ఉద్యమంలో పాల్గొన్నందుకు జీవితానికి సార్థకత లభించిందనిపించింది.
ఉద్యమ అనుభవాలద్వారా నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. ఎంచుకున్న దారిలో తొణకకుండా, బెణకకుండా వెళితేనే విజయం వరిస్తుందనే సిద్ధాంతాన్ని నమ్మాను. తర్వాత కొంతకాలానికి పెండ్లయింది. పెండ్లికి ముందు నాకు, పాటకు ఎలాంటి అటాచ్మెంట్ ఉందో, పెండ్లి తర్వాతకూడా అలాంటి అనుబంధమే ఉంది. ఈ విషయంలో మా ఆయన సహకారం మరువలేనిది. ‘చదువుకోమంటే మధ్యలోనే ఆపేసింది. కెరీర్ ఎట్లుంటదో ఏమో?’ అని మా తల్లిదండ్రులు అనుకునేవాళ్లు. పాటల ద్వారా లభిస్తున్న ఆదరణ చూసి సంతోష పడ్డారు. వాళ్లు చాలా కష్టపడి పైకొచ్చారు. అమ్మయితే మేము పుట్టిన తర్వాత చదువుకొని ఉద్యోగం సంపాదించింది. ఆ కష్టం మేం పడొద్దనేది వారి తాపత్రయం.
ఎంత ఆశతో పాటతో పెరిగానో, పాటకూడా అంతే మంచి భవిష్యత్ను నాకు ఇచ్చింది. ‘అమూల్య ఏమైపోతుందో. ఊ అంటే ఉద్యమంలో ఉరుకుతుంది’ అనుకున్నోళ్లు ఆశ్చర్యపడేలా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘సాంస్కృతిక సారథి’లో ఉద్యోగం లభించింది. ఒక కళాకారిణిగా నాకు డబ్బు ముఖ్యం కాదు. వేదిక ఎక్కి పాట పాడిననా లేదా? నా పాటకు చప్పట్లు కొట్టిర్రా లేదా? అనేదే ముఖ్యం. పాడకపోతే మనసు అదోలా ఉంటుంది. అందుకే, ఖాళీగా ఉండొద్దని ‘ఫోక్ స్టూడియో యూట్యూబ్ చానెల్’ను ప్రారంభించాను. కొత్తవాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో, మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలనే ఆలోచనతో పనిచేస్తున్నా. తాజాగా అంబేద్కర్ సాంగ్, మదర్స్డే సాంగ్కు మంచి స్పందన వస్తున్నది.
మా తమ్ముడు ఎంబీబీఎస్ చేశాడు. అక్క లెక్చరర్. ‘మరి, నీదేంటి?’ అని అందరూ అంటుండేవాళ్లు. అప్పుడు కొంత ఇబ్బందిగా అనిపించేది. కానీ, నాపై నాకు నమ్మకం ఉండేది. అది నాకు మాత్రమే తెలుసు. కాకపోతే లక్ష్యం చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు నా పాటలు, నాకొచ్చిన గుర్తింపు చూసి అందరూ హ్యాపీగా ఉన్నారు. పాట నా జీవితంలో ఉంది కాబట్టే, నేను బతుకుతున్నా. చనిపోయే వరకు కూడా పాడుతూనే ఉంటాను. పాటే నా శ్వాస.
ఇప్పటి వరకు నేను 50కి పైగా జానపదాలు పాడాను. వీటిలో బతుకమ్మ పాటలుకూడా ఉన్నాయి. జానపదాల్లో మానుకోట ప్రసాద్తో చేసిన ‘ఏ ఊరు ఓ సుందరయ్యా’ పాట మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ప్రేక్షకుల ఆదరణ కూడా పొందింది. బతుకమ్మ పాటలలో మాట్ల తిరుపతి అన్నతో తీసిన ‘వక్కేసి పువ్వేసినా నూటొక్కపూల జాతర’ పాట బాగా ఆకట్టుకుంది. ప్రతీ బతుకమ్మకు కచ్చితంగా పాట పాడుతున్నాను. ఉద్యమంతో ఎటాచ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి, నానుంచి ఎక్కువగా సామాజిక గీతాలు
వస్తున్నాయి.
–దాయి శ్రీశైలం