పరిగి/షాబాద్, మార్చి 18: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యమిచ్చింది. గురువారం శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని యాచారం, కడ్తాల్, షాద్నగర్, చేవెళ్ల, శంకర్పల్లి మీదుగా సంగారెడ్డి వరకు రిజినల్ రింగ్రోడ్డు ఏర్పాటు కోసం రైతుల నుంచి త్వరలో భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం రూ.750 కోట్ల నిధులు కేటాయించింది. రైతుల నుంచి భూసేకరణ చేపట్టిన తర్వాత రిజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటైతే రవాణా సదుపాయం మరింత సులభం కానున్నది. ప్రస్తుతం ఔటర్ రింగ్రోడ్డుకు 30 కిలోమీటర్ల దూరంలో మొత్తం 348 కిలోమీటర్ల మేర రిజినల్ రింగ్ రోడ్డు నిర్మించనున్నారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రూ.1500 కోట్ల నిధులు కేటాయించింది.
స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి
రాష్ట్ర బడ్జెట్ రూ.2,30,825.96 కోట్లుగా ప్రతిపాదించారు. నియోజకవర్గాల అభివృద్ధిపై ఈసారి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కరికి రూ.5కోట్ల చొప్పున అందించేందుకు బడ్జెట్లో రూ.800కోట్లు కేటాయించారు. వినియోగానికి ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలను విడుదల చేయనున్నది. స్థానిక సంస్థల బలోపేతంపై దృష్టి కేంద్రీకరించిన సర్కారు అందుకు సంబంధించి జడ్పీలకు రూ.252కోట్లు, మండల పరిషత్లకు రూ.248 కోట్లు కేటాయించింది. దీంతో వికారాబాద్ జిల్లాలోని 18 మండల పరిషత్లకు పెద్ద మొత్తంలో నిధులు రానున్నాయి.
సీఎం దళిత్ ఎంపవర్మెంట్తో సంక్షేమానికి పెద్దపీట
షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ఈసారి ప్రభుత్వం సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి శ్రీకారం చుట్టింది. షెడ్యూల్డ్ కులాల వారి సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ పథకం ప్రారంభించనున్నారు. ఇందుకు రూ.వెయ్యి కోట్లు బడ్జెట్లో కేటాయించారు. బీసీ కార్పొరేషన్, అత్యంత వెనుకబడిన తరగతుల కార్పొరేషన్కు రూ.వెయ్యి కోట్లు నిధులు కేటాయించారు. మరోవైపు నాయీ బ్రాహ్మణులు ఆధునిక సెలూన్లు, రజకులు అధునాతన వసతులతో కూడిన దోభీఘాట్లు ఏర్పాటు చేసుకునేందుకు సర్కారు ఆర్థిక సాయం చేయనున్నది. గీత కార్మికుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన నీరా పాలసీ అమలుకు రూ.25 కోట్లు కేటాయించింది. మరోవైపు మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించేందుకు ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా 3లక్షల గొర్రె పిల్లల యూనిట్ల పంపిణీకి రూ.3వేల కోట్లు కేటాయించగా, వికారాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం 11 వేల యూనిట్ల గొర్రె పిల్లలు పంపిణీ చేయనున్నారు.
వ్యవసాయ రంగానికి ప్రత్యేక కేటాయింపులు
వ్యవసాయం దండగ కాదు పండుగ అని చేసి చూపించడంతోపాటు రైతును రాజు చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలుచేస్తున్నారు. అందులో భాగంగా సాగుకు అవసరమైన పెట్టుబడుల కోసం రైతుబంధు, బీమా, తదితర వాటికి బడ్జెట్లో రూ.14,800 కోట్లు కేటాయించారు. వికారాబాద్ జిల్లాలో సుమారు 2.16 లక్షల మంది రైతులకు రూ.294 కోట్లు అందించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.25 వేల లోపు రుణం గల వారికి రుణమాఫీ వర్తింపజేసిన సర్కారు, మిగతా రైతులకోసం బడ్జెట్లో రూ.5,225 కోట్లు కేటాయించింది. దీంతో జిల్లావ్యాప్తంగా రైతాంగానికి మేలు చేకూరనున్నది. పొలాల వద్ద కల్లాల నిర్మాణానికి, సమగ్ర భూ సర్వేకు ఈసారి రూ.400 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు కేటాయించింది. దీంతో రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందనున్నాయి. ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు రైతాంగానికి ఎకరాకు రూ.30 వేలు సబ్సిడీ అందజేయనున్నది. దీంతోపాటు మిగతా డబ్బును బ్యాంకుల ద్వారా రుణంగా ఇప్పించనున్నది. రుణాలు వెంటనే చెల్లించకుండా నాలుగేండ్లపాటు మారటోరియం విధించనున్నది.
భారీగా కేటాయింపులు
గిరిజనతండాలకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించడంపై సర్కారు దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా రూ.165 కోట్లు కేటాయించింది. దీంతో వికారాబాద్ జిల్లాలోని పలు గిరిజన తండాలకు బీటీ రోడ్డు సదుపాయానికి నిధులు అందనున్నాయి. మరోవైపు వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు నిధులు కేటాయించింది. రోడ్లు, భవనాల శాఖకు రూ.800కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.300 కోట్లు కేటాయించారు. రెండేళ్లలో రూ.4వేల కోట్లు ఈ పథకం కింద వెచ్చించనున్నారు. ఈసారి బడ్జెట్లో రూ.2వేల కోట్లు కేటాయించింది. వికారాబాద్ జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1031 ఉన్నాయి.
జిల్లాలో నాలుగు సమీకృత మార్కెట్లు
గజ్వేల్ తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో సమీకృత వెజ్-నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణానికి సర్కారు నిర్ణయించి బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఇందుకుగాను బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించారు. వికారాబాద్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టనున్నారు. కూరగాయలు, మాంసం, చేపలు, పండ్లు విక్రయించేలా ప్రత్యేకంగా నిర్మాణాలు చేపట్టనున్నారు. తద్వారా అన్ని రకాల కూరగాయలు, నాన్వెజ్ ఒకే దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ప్రతి పోలీస్స్టేషన్లో షీ టాయిలెట్ల నిర్మాణానికి బడ్జెట్లో రూ.20కోట్లు కేటాయింపు చేపట్టారు. పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుబీమాతో ఆ కుటుంబాలకు ధీమా, రుణమాఫీ, పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చింది. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు విజయ డెయిరీతో లీటర్ పాలకు రూ.5 అదనంగా చెల్లిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ప్రభుత్వం ఉపాధి ఆవకాశాలు కల్పిస్తున్నది.