ఉట్నూర్, ఆగస్టు 4 : గిరిదర్శిని పుస్తకాలను విద్యార్థులకు వేగంగా అందించాలని ఐటీడీఏ డీడీ సంధ్యారాణి అన్నారు. స్థానిక కుమ్రం భీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో బిడ్జి కోర్సు పుస్తకాలను పోస్ట్ ద్వారా అందజేసే కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో పాఠశాలలు నడిపే పరిస్థితి లేకపోవడంతో కమిషన్ ఆదేశాల మేరకు గిరిజన విద్యార్థులకు విద్యాభ్యాసం అందించేందుకు గిరిదర్శిని పథకం రూపొందించామన్నారు. అలాగే ఆన్లైన్ ద్వారా అందరికీ విద్య అందడం లేదని తెలిపారు. గిరిదర్శిని ద్వారా మూరుమూల గ్రామాల్లోని మూడో తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు పుస్తకాలను ప్రతి నెలా అందిస్తామని తెలిపారు. వాటిని విద్యార్థులు చదవడం, రాయడం పూర్తిచేసి మళ్లీ ఉపాధ్యాయులకు అందజేస్తారని చెప్పారు. ప్రతి ఉపాధ్యాయుడికీ గ్రామాలను దత్తత ఇచ్చామని తెలిపారు. దీని ద్వారా విద్యార్థులు విద్యకు దూరం కాకుండా ఉపయోగపడనుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏటీడీవో క్రాంతికుమార్, జీసీడీవో చాయ, ఏసీఎంవో జగన్, ఉపాధ్యాయులు సుదర్శన్, మధుసూదన్, బంకట్లాల్, సిబ్బంది ఉన్నారు.