కారేపల్లి : ఖమ్మం జిల్లా కారేపల్లి ( Karepalli ) మండల కేంద్రంలోని కవిత ఇంజనీరింగ్ కళాశాల భవనంలో నిర్వహిస్తున్న తెలంగాణ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల పాఠశాలను(ఇల్లందు) ఆదివారం భద్రాద్రి జోనల్ అధికారి పోతుల అపర్ణ ( Pothula Aparna ) సందర్శించారు. ముందుగా వంటశాలకు వెళ్లి నిర్వాహకులతో మాట్లాడి విద్యార్థులకు అందజేస్తున్న మెనూను పరిశీలించారు.
అనంతరం తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థుల సబ్జెక్టుల వారిగా ప్రతిభను తెలుసుకున్నారు. విద్యార్థులకు అందుతున్న తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు,వసతి గృహాల నిర్వహణను పరిశీలించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు పౌష్టికాహారం, నాణ్యమైన భోజనం సమయానికి అందుతుందో లేదో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్లో అన్ని గ్రూపులలో తక్షణ ప్రవేశాలను కల్పించేందుకు సోమవారం ఖమ్మం జిల్లా తిరుమలయపాలెంలో బాలురకు, టేకులపల్లిలో బాలికలకు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో బాలురకు, ములకలపల్లిలో బాలికలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గురుకుల సంక్షేమ పాఠశాలలు, కళాశాలల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది అన్నారు. విద్యార్థులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతులు, నాణ్యత ప్రమాణాలను పాటిస్తుందన్నారు. ఆమె వెంట పాఠశాల ప్రిన్సిపల్ వాణి, వైస్ ప్రిన్సిపల్ రత్నలత, బోధన బోధనేతర సిబ్బంది ఉన్నారు.