Letter | మధిర, జూలై 15: ‘తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోయే’, ‘రెక్కలు లేని పిట్ట గూటికి సరిగ్గా చేరింది’ అంటూ బుడుగులకు పెద్దలు ‘ఉత్తరం’పై పొడుపు కథలు వేసేవారు. ‘ఉభయ కుశలోపరి’, ‘గంగా భాగీరథి సమానురాలైన అమ్మగారికి’, ‘దైవ సమానురాలైన నాన్న గారికి’, ‘చిరంజీవికి ఆశీస్సులు’ అని ఇంటికి వచ్చిన ‘ఉత్తరం’లో పలకరింపులు ఉండేవి. ‘ఉత్తరాల ఊర్వశి.. ప్రేమలేఖ ప్రేయసి’, ‘మా పెరటి జాంచెట్టు పళ్లన్నీ కుశలం అడిగే’, ‘ఊరూ వాడ అక్కల్లారా ఉత్తర మొచ్చింది’, మనుషుల్లో జెంటిల్మ్యాన్ పోస్టుమ్యానూ..’ అంటూ సినీ గేయ రచయితలు సినిమా కథల ఔచిత్యపరంగా పాటలు రాసేవారు. ఇక మహాకవి శ్రీశ్రీ ఇతర కవులతో జరిపిన ఉత్తర ప్రత్యోత్తరాలు, మన నవ భారత నిర్మాత ప్రధాని నెహ్రూ జైలు జీవితంలో ఉండి తన గారాలపట్టి ఇందిరా గాంధీకి రాసిన వైజ్ఞానిక లేఖలు ఏకంగా పుస్తకాల రూపంలో అచ్చయ్యాయి. విశేష జనాదరణ పొందాయి. అంతటి ప్రాధాన్యమున్న ‘ఉత్తర సంస్కృతి’ని వస్తూ వస్తూ ప్రపంచీకరణ కబళించింది. ఇప్పుడు ‘తోకలేని పిట్ట’ జాడేలేదు. దాని గమనం.. వైభవం.. అంతర్థానంపై ‘నమస్తే’ సండే స్పెషల్ స్టోరీ.
ఆధునీకరణ యుగంలో శాస్త్ర సాంకేతిక రంగాల ఫలాలు అరచేతిలోకి రావడంతో.. అప్పటి వరకూ చేతిలో ఉన్న ఉత్తరాలు క్రమంగా కనుమరుగయ్యాయి. ఉత్తరాలతో మనిషి పెనవేసుకున్న ఆత్మీయానుబంధాలు కూడా కాలక్రమంలో మెల్లగా వీడిపోయాయి. ఒకనాడు క్షేమ సమాచారం తెలుసుకునేందుకు రోజుల సమయం పట్టిన పరిస్థితుల నుంచి.. నేడు అదే క్షేమ సమాచారాన్ని ఖండాంతరాల నుంచి కూడా క్షణాల్లో తెలుసుకునేంత సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీంతో సహజంగానే ఉత్తరాలు జాడలేకుండా పోయాయి. కానీ వాటితో ఉన్న అనుబంధాలు, అనుభూతులు ఇప్పటికీ నెమరువేసుకోదగినవే. బహుళ ప్రయోజనాలతో విప్లవంలా వచ్చిన సెల్ఫోన్లతో ఉత్తరాలేగాక అటు పోస్టుమ్యాన్లు కనుమరుగయ్యారు. ఇటు పోస్టాఫీసులూ ప్రాభవం కోల్పోయాయి. ఇదే సమయంలో సమాచార వ్యవస్థను సాంకేతికంగా మరింత చేరువ చేసినప్పటికీ.. ఉత్తరాలను చేతితో రాయడం, వాటిని అందుకునే వారిని సంబోధించడం, వచ్చిన ఉత్తరాలను నోరారా చదవడం, కొన్నింటిని దాచుకొని మరీ మళ్లీ మళ్లీ చదువుకోవడం వంటి తృప్తిని మాత్రం తమతోపాటు తీసుకెళ్లిపోయాయి మన తోకలేని పిట్టలు.
ఉత్తరమే నాటి సమాచారం..
1970 క్రితం గ్రామాల్లో టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ లేకపోవడంతో బంధువులు, మిత్రుల సమాచారాన్ని తెలుసుకోవాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలకు అర్జీలు పంపాలన్నా ఉత్తమ ప్రధానమయ్యేది. అప్పట్లో 15 పైసలకే కార్డు ఉత్తరం, 35 పైసలకు ఇన్లాండ్ ఉత్తరం, 50 పైసలకు బుక్పోస్టు కవర్ ఉత్తరం వంటివి పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉండేవి. ఉత్తరాలకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ఆదరణ ఉండేది. బతుకుదెరు కోసం పట్నాలకు వలస వెళ్లిన వారు గ్రామాల్లోని తమ కుటుంబాలకు తమ యోగ క్షేమాల సమాచారాన్ని పోస్టుకార్డు ద్వారానే తెలియజేసే వారు. ఇలా క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఒక్కోసారి పది రోజులకు పైగా సమయం పట్టేది. సుదూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఏమైనా ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో, మరణించిన సమయాల్లో పోస్టాఫీసు నుంచి టెలిగ్రామ్ ద్వారానే సమాచారం అందేది. అప్పట్లో దూరప్రాంతాల్లో ఉన్న బంధువులను శుభకార్యాలకు ఆహ్వానించాలంటే పోస్టుకార్డు ఉత్తరానికి నాలుగు మూలలా పసుపు, కుంకుమలు రాసి పంపేవారు. అలాగే అశుభకార్యాలకు నల్లటి మసి రాసి పంపేవారు. పోస్టుమ్యాన్ ఇంటి ముందుకు వస్తే ఎలాంటి కబురు వచ్చిందోనని అతృత ఉండేది. ఉత్తరం రాయడానికి, వచ్చిన ఉత్తరంలో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవడానికి.. చదువు కొన్నవాళ్ల కోసం గ్రామాల్లో వెతుకులాడి బతిమిలాడే పరిస్థితి ఉండేది.
బ్యాంకులుగా మారినా పోస్టాఫీసులు..
ఒకనాడు ఉత్తరాల బడ్వాడాకు, మనీ ఆర్డర్లు పంపేందుకు, పొదుపు పథకాలు అందించేందుకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న పోస్టాఫీసులు కాలానుగుణంగా అవి కూడా తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు సేకరిస్తూ, బీమా పాలసీలు అందిస్తూ బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. ప్రజలు కూడా అందివచ్చిన టెక్నాలజీకి అలవాటు పడడం, దానికి మొబైల్ కంపెనీలు కూడా సహకరించి తమ పోటీతత్వంతో తక్కువ ధరలకు స్మార్ట్ఫోన్లు అందించడం, ఇక టెలీకాం కంపెనీలు కూడా అదేబాటలో నడవడం వంటి కారణాలతో పోస్టాఫీసులు ప్రాభవం కోల్పోయాయి. ఉత్తరాలు కనుమరుగయ్యాయి. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఒక సెల్ఫోన్, రెండు సిమ్ములు ఉండడం, గ్రామాల్లోని దినసరి కూలీలు కూడా సెల్ఫోన్లు విరివిగా వినియోగించడం వంటి కారణాలలో ఉత్తరం అంతర్థానమైనట్లుగానే అ(క)నిపిస్తోందంటే అతిశయోక్తిగా లేదు.
ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ రాకతో..
ఇప్పుడు ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ వంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి రావడంతో ఉత్తరాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ఇప్పుడున్న పెద్దల్లో చాలామందికి చదువు రాకపోయిన వారు ఫోన్ ద్వారా దూరప్రాంతాల్లోని తమ కుటుంబ సభ్యులతో మాట్లాడగలుగుతున్నారు. ఇప్పుడున్న యువతకు ఉత్తరాల పరిచయం పెద్దగా లేదు. వారి ముందుతరం వారు ఉత్తరాలు రాయడాన్ని మర్చిపోయారు. పార్సిళ్ల వంటివి పంపాలంటే కూడా ప్రైవేటు సంస్థలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పోస్టాఫీసుల్లో పోస్టు కార్డులు, ఇన్లాండ్ లెటర్లు, బుక్పోస్టు లెటర్లు కన్పించడం లేదంటే అతిశయోక్తి కాదేమో.