Ram Charan | మెగా పవర్స్టార్ రాంచరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 4న థియేటర్లలోకి రాబోతున్న నేపథ్యంలో, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘యూ/ఏ 16+’ సర్టిఫికేట్ను జారీ చేసింది.
ఈ సినిమా నిడివి విషయానికి వస్తే.. ‘పెద్ది’ మొత్తం 189 నిమిషాల రన్టైమ్ను కలిగి ఉన్నట్లు తెలుస్తుంది, అంటే ఈ చిత్రం 3 గంటల 9 నిమిషాల పాటు ప్రేక్షకులను అలరించనుంది. సెన్సార్ బోర్డ్ సూచనల ప్రకారం చిత్రంలో కొన్ని చిన్న మార్పులు, కట్స్ చేశారు. ఇందులో భాగంగా రాజస్థాన్ అనే పదాన్ని, అలాగే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన ప్రస్తావనను తొలగించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు మరో ఆరు పదాలను మ్యూట్ లేదా మార్పులు చేశారు. అయితే ఈ కట్స్ మరియు మార్పుల వల్ల సినిమా నిడివిలో ఎలాంటి మార్పు రాలేదని, రన్టైమ్ 3 గంటల 9 నిమిషాలుగానే లాక్ అయిందని చిత్రబృందం పేర్కొంది.
ఇటీవలే ముంబైలో జరిగిన ఒక భారీ ఈవెంట్లో ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ను విడుదల చేయగా, దానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ఈ చిత్రంలో రాంచరణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, జాన్వీ కపూర్ ‘అచియమ్మ’ పాత్రలో కనిపిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వృద్ధి సినిమాస్ మరియు ఐవీవై (IVY) ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.