ఖమ్మం ఎడ్యుకేషన్, డిసెంబర్ 13: బాలలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. శాస్త్రవేత్తల ఆలోచన విధానాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని తమకున్న వనరులతో ప్రయోగాలు చేయడాన్ని అలవర్చుకోవాలని సూచించారు. తద్వారా మేథోశక్తి పెంపొందుతుందని అన్నారు. విద్యార్థులను ప్రోత్సహిస్తే పరిశోధనల్లో వారు సత్తా చాటుతారని పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో మూడు రోజులపాటు జరిగే 50వ జిల్లాస్థాయి గణితం, పర్యావరణ ప్రదర్శన, రాష్ట్రీయ బాల వైజ్ఞానిక ప్రదర్శనలను మంగళవారం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. తొలుత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. పరిశోధకులు తమకున్న శక్తిని యంత్ర శక్తిగా మార్చే విధానాన్ని విద్యార్థులు గమనించాలని సూచించారు. నిజ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలపై నమూనాలు రూపొందిస్తే మంచి మరింత ఫలితముంటుందని అన్నారు.
ఆకట్టుకున్న ప్రారంభ కార్యక్రమం..
సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీఈవో సామినేని సత్యనారాయణ ఆధ్వర్యంలో వివిధ కమిటీల సహకారంతో ఏర్పాటు చేసిన వేదిక అలరించింది. టీఎస్డబ్ల్యూఆర్ఎస్ విద్యార్థినులు చేసిన స్వాగత నృత్యాలు అద్భుతంగా ఉన్నాయి. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను స్పష్టం చేసేలా నృత్య ప్రదర్శనలు సాగాయి. సాయంత్రం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.
కమిటీలతో పర్యవేక్షణ..
విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా 15కి పైగా కమిటీలతో 110కి పైగా ఉపాధ్యాయులు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఇవ్వడంతోపాటు వారికి వసతి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. నమూనాల రిజిస్ట్రేషన్ల కోసం 8కి పైగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రదర్శనలో 40 గదులు, 700కి పైగా టేబుళ్లు ఏర్పాటు చేశారు. వైద్య, విద్యుత్, పోలీస్, మున్సిపల్ సిబ్బంది సేవలందిస్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఇన్స్పైర్ 71 ప్రాజెక్టులు, భద్రాద్రి జిల్లా నుంచి ఆరు ప్రాజెక్టులు వచ్చాయి. సైన్స్ఫెయిర్కు 506 ప్రాజెక్టులు వచ్చాయి. కాగా, ఇన్స్పైర్ ప్రదర్శనలను పరిశీలించేందుకు న్యాయ నిర్ణేతలుగా ముగ్గురిని నియమించారు. సైన్స్ఫెయిర్కు 6 బృందాల్లో 12 మందిని నియమించారు. మొత్తం 15 మందిలో డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, జూనియర్ కళాశాలల అధ్యాపకులు ఉన్నారు. 15 మందిని ఏడు బృందాలుగా కేటాయించి ఒక్కో బృందంలో ఇద్దరిని నియమించారు. వీరు ఆయా అంశాలను పరిగణనలోకి తీసుకుని జడ్జి చేయనున్నారు.
భోజన ఏర్పాట్లు భేష్..
సైన్స్ఫెయిర్, ఇన్స్పైర్కి జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి విద్యార్థులు, గైడ్ టీచర్లు హాజరయ్యారు. సుమారు 1200 వరకు విద్యార్థులున్నారు. వీరికి టిఫిన్, రెండు పూటలా భోజనం అందించే ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
సైన్స్ టీచర్లతో కేంద్ర అబ్జర్వర్ భేటీ..
ఇన్స్పైర్ అవార్డుకు సంబంధించి ప్రదర్శనలు ఎంపిక చేయడం, హాజరైన ప్రాజెక్టుల్లో 10 శాతం వరకు రాష్ట్రస్థ్ధాయికి ఎంపిక చేయడం వంటి అంశాలపై కేంద్ర అబ్జర్వర్ సుభ్రత్ సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. మూడు రోజులపాటు ప్రాజెక్టులను పరిశీలించడంతోపాటు విభాగాల వారీగా మెరుగైన వాటిని ఎంపికచేయనున్నారు. సైన్స్ఫెయిర్లో జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో ఏడు బహుమతులు ఎంపిక చేయనున్నారు.
నేడు మండలాల నుంచి విద్యార్థులు..
విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్లను తిలకించేందుకు బుధవారం ఎనిమిది మండలాల విద్యార్థులకు అవకాశం కల్పించారు. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం, కూసుమంచి, తిరుమలాయపాలెం, ముదిగొండ, చింతకాని, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి మండలాల విద్యార్థులను తీసుకురావాలని డీఈవో సత్యనారాయణ ఉపాధ్యాయులకు సూచించారు.
సైన్స్ అంటే జీవన విధానం: కలెక్టర్ వీపీ గౌతమ్
సైన్స్ అంటే ఒక జీవన విధానమని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. సైన్స్ను కేవలం తరగతి గదికో, పరీక్షలకో పరిమితం చేయకుండా నిత్య జీవితంలో వినియోగించి ప్రజాసమస్యలకు పరిష్కారం చూపించాలని ఆకాంక్షించారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో సైన్స్ ప్రముఖ పాత్ర వహిస్తుందని అన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. ప్రాక్టికల్ నాలెడ్జ్ సాధిస్తేనే ప్రయోగాలకు ప్రయోజనం ఉంటుందని, అందుకు ప్రతి అంశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. డీఈవో సత్యనారాయణ మాట్లాడుతూ.. సైన్స్ సంబంధ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సైన్స్ పరిజ్ఞానం మరింత పెంపొందుతుందని అన్నారు. వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రదర్శనలకు పంపించనున్నుట్ల వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి సైన్స్ఫెయిర్కి 506 నమూనాలు, ఇన్స్పైర్కి 77 నమూనాలు వచ్చినట్లు చెప్పారు. మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, ఎన్ఐఎఫ్ సుభ్రత్, అర్బన్ ఎంఈవో శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి సైదులు, ఏఎంవో రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.