రఘునాథపాలెం, ఫిబ్రవరి 21 : జిల్లాలో ఇసుక, మైనింగ్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలను విస్తృతం చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి ఆఫ్రిన్ సిద్దిఖీ అన్నారు. రెండు రోజుల క్రితం జిల్లా రవాణా శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆమె బుధవారం విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘జోర్దార్.. సర్దార్’ కథనాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. జిల్లాలో ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా పోలీసులతో కలిసి జాయింట్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ముమ్మరం చేస్తామన్నారు.
రోడ్డు భద్రత, ప్రమాదాలను నివారించడానికి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. తమ కార్యాలయానికి పలు సేవల నిమిత్తం వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో యువకుల ర్యాష్ డ్రైవింగ్పై ప్రత్యేక దృష్టి పెడతామని, మైనర్లు వాహనాలతో రోడ్డెక్కితే సదరు వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. రవాణా శాఖ కార్యాలయం పక్కన రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులతో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించామని, లైసెన్స్లు లేకుండా షాపులు నిర్వహిస్తున్న వారికి నోటీసుల జారీ కోసం కార్పొరేషన్ అధికారులతో మాట్లాడుతామని ఆమె పేర్కొన్నారు.