వేంసూరు, జనవరి 27: ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మండలానికి రూ.17 కోట్ల నిధులు మంజూరయ్యాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మండలంలోని లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడారు. సీఎస్ఆర్ ద్వారా రూ.1.90 కోట్లు, ఈజీఎస్ ద్వారా రూ.22 లక్షలను సీసీ రోడ్ల నిర్మాణాలకు వెచ్చించామన్నారు. ఏడు నూతన పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.1.40 కోట్లు, 14 కమిటీ హాళ్ల నిర్మాణానికి రూ.3.65 కోట్లు, మర్లపాడు – అమ్మపాలెం రహదారి నిర్మాణానికి డీఎంఎఫ్డీ ద్వారా రూ.4 కోట్ల చొప్పున మంజూరు చేసినట్లు వివరించారు.
వేంసూరు పీహెచ్సీ అభివృద్ధికి రూ.35 లక్షలు మంజూరయ్యాయన్నారు. బీరాపల్లికి పీహెచ్సీ మంజూరు కోసం మంత్రి హరీశ్కు విన్నవించినట్లు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. గవర్నర్, రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని దుయ్యబట్టారు. రిపబ్లిక్ డే వేడుకలను కూడా రాజకీయం చేయడం కేంద్ర దుష్ట ప్రవర్తనకు నిదర్శనమని అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ముజాహిద్, వీరేశం, పగుట్ల వెంకటేశ్వరరావు, దొడ్డా శ్రీలక్ష్మి, రంజిత్కుమార్, ఫైజుద్దీన్, మందపాటి వేణుగోపాల్రెడ్డి పాల్గొన్నారు.
రూ.2 లక్షల బీమా చెక్కు అందజేత..
మండలంలోని చౌడవరం తండాకు చెందిన గుగులోతు వెంకటేశ్వరరావు ప్రమాదవశాత్తూ చెరువులో పడి చనిపోగా.. అతడికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో బీమా పరిహారం రూ.2 లక్షలు మంజూరయ్యాయి. ఆ చెక్కును వెంకటేశ్వరరావు భార్య ఝాన్సీరాణికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను అందజేశారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ఎమ్మెల్యేకు మైనార్టీ నేతల సన్మానం..
మండలంలోని షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.75 లక్షలు మంజూరు చేయించినందుకు కృతజ్ఞతగా ముస్లిం మతపెద్దలు, మైనార్టీ నాయకులు కలిసి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యను సన్మానించారు.