– స్పందించకపోతే వేలాది మందితో రిజర్వాయర్ దిగ్బంధం
– పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి
ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 05 : పాలేరు రిజర్వాయర్ కింద ఉన్నటువంటి పాత కాల్వకు తక్షణం నీళ్లు వదలాలని, లేనియెడల వేలాది మంది రైతులతో రిజర్వాయర్ను దిగ్బంధం చేస్తామని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్ క్రాస్ రోడ్లో నిర్వహించిన బీఆర్ఎస్ యువజన సంఘం ర్యాలీ అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలేరు రిజర్వాయర్ పరిధిలో ఉన్న పాత కాల్వకు నీళ్లు వదలాలని గత కొద్ది రోజుల నుండి రైతుల పక్షాన సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందన్నారు. అయితే అధికారులు కేవలం శుక్రవారం రాత్రి పాలేరు పెద్ద కాల్వకు నీళ్లు వదిలినట్లు తెలుస్తుందన్నారు.
ఈ విషయంపై అధికారులను మరోసారి వివరణ కోరగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు నీరును వదిలినట్లు బదులిచ్చారన్నారు. మరి పాలేరు ఎమ్మెల్యే పాత కాల్వకు నీళ్లు తీసుకురాకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పాత కాల్వ పరిధిలోని సాగు రైతులు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణం పాత కాల్వకు నీళ్లు వదలకపోతే వేలాది మంది రైతులతో పాలేరు రిజర్వాయర్ను దిగ్బంధం చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పాలేరు ప్రదాత అని చెప్పుకునే మంత్రికి పాత కాల్వ నీళ్లు ఎందుకు వదలాడానికి ప్రయత్నం చేయడం లేదని కందాల విమర్శించారు.