సత్తుపల్లి, ఏప్రిల్ 2ః సీఎం కేసీఆర్ విజన్తోనే రాష్ట్రంలో నీళ్లూ నిధులు నియామకాలు సాధ్యమయ్యాయని, కేసీఆర్ను మూడోసారి సీఎంని చేసేందుకు ప్రతి కార్యకర్త పనిచేయాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. గంగారంలోని వాసు గార్డెన్స్లో ఆదివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన నిర్వహించిన పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాకముందు ఇప్పటికీ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, పంటలకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్న దేశంలో ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. సాగునీటి ప్రాజెక్ట్లు నిర్మించి కేసీఆర్ రాష్ర్టాన్ని కోటి ఎకరాల మాగాణిని చేశారన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుందన్నారు.
ఎన్నికల సమయంలో కొందరు సీజనల్ నాయకులు ప్రజల మధ్యకు వస్తారన్నారు. ప్రజలు వారి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి రైతులు పంట నష్టపోతే సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయికి వచ్చి పంటలను పరిశీలించారన్నారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం ప్రకటిం చారన్నారు. గత ప్రభుత్వాల హయాంలో ఢిల్లీ నుంచి ఉత్తర్వులు వచ్చేవరకు రైతులు వేచిచూడాల్సిన పరిస్థితి ఉండేదని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతిగా రైతులకు అండగా నిలుస్తున్నారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా హైమావతి, ఆత్మా చైర్మన్ వనమా వాసు, మునిసిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య. పార్టీ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి..
కార్యకర్తలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందుకే పార్టీ అధిష్ఠానం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం అభివృద్ధిని గురించే ఆలోచిస్తారు. తెలంగాణ వచ్చిన తర్వాతే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమైంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య నిరంతరం శ్రమిస్తున్నారు. ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా విజయవంతంగా చేపడుతున్నారు. ప్రజాసమస్యలపై ఎమ్మెల్యే సరాసరి ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. కుట్ర రాజకీయాలు చేస్తున్న వారితో అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో సత్తుపల్లిలో విజయబావుటా ఎగురవేయాలి. మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయాలి.
రాజ్యసభ సభ్యుడు బండి పార్థసారథిరెడ్డి నేను ప్రజాసేవకుడిని..
నేను తప్పుడు పద్ధతుల్లో రాజకీయాలు చేయను. మూర్ఖులు చేసే విమర్శలను పట్టించుకోను. కొంతమంది కుట్రలతో ఇటీవల రాజకీయాలు చేస్తున్నారు. నేను నైతిక విలువలతో పోరాడతా.. నేను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను. కులమతాలకు అతీతంగా నియోజకవర్గంలో సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేరుస్తున్నాను. కార్యకర్తలతో ఆత్మీయంగా మాట్లాడేందుకే పార్టీ అధిష్ఠానం ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నది. కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలి. తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధిని వివరించాలి. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదు.
సీఎం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు గౌరవం పెంచారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపించి కేసీఆర్ రుణం తీర్చుకోవాలి. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో వైకుంఠ ధామం, పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చాయి. పల్లెలన్నీ అభివృద్ధి బాట పట్టాయి. పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్లో రూ.600 మాత్రమే పింఛన్ అందుతున్నది. తెలంగాణలో వృద్ధులకు రూ.2,016, దివ్యాంగులకు రూ.3,016 పింఛను అందుతున్నది. మన ఊరు-మనబడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లుగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నియోజకవర్గ వ్యాప్తంగా 4 వేల మందికి సాయం అందింది. నియోజకవర్గవ్యాప్తంగా 25కి పైగా పలె ్లదవాఖానలు ఏర్పాటు చేశాం. రూ.35 కోట్లతో సత్తుపల్లిలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తున్నాం. మాజీ మంత్రి తుమ్మల చేసిన అభివృద్ధిని నేను కొనసాగిస్తున్నా.
సీతారామ ప్రాజెక్ట్తో ఉమ్మడి జిల్లా సస్యశ్యామలం
సంక్షేమ రాజ్యాన్ని స్థాపించేందుకే కేసీఆర్ కొట్లాడి తెలంగాణ సాధించారు. అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేశారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గోదావరి ఆధారంగా ప్రతిష్ఠాత్మకంగా సీతారామ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. రూ.13 వేల కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తయితే ఉమ్మడి జిల్లా సస్యశ్యామలమవుతుంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాన్ని అక్షరాలా అమలు చేస్తున్నారు. రాష్ట్రం సిద్ధించకముందే విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేది. తెలంగాణ వచ్చిన కొద్ది నెలల్లోనే కేసీఆర్ సమస్యకు పరిష్కారం చూపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు సరఫరా చేస్తున్నారు. అశ్వాపురం, సుబ్బాయిగూడెం, కమలాపురంలలో సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ పనులు పూర్తయ్యాయి. సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంటలో టన్నెల్ పూర్తయితే బేతుపల్లి, లంకాసాగర్, వైరా, పాలేరుకు నీరు పుష్కలం. తాజాగా ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులకు నిధులు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో 50 వేల ఎకరాలకు పైగా ఆయిల్ పాం సాగవుతున్నది. అభివృద్ధిలో సత్తుపల్లి నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తున్నది.
– మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
మార్గదర్శకుడు సీఎం కేసీఆర్..
అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. మార్గదర్శకుడిగా కేసీఆర్ అనతికాలంలోనే రాష్ర్టాన్ని అభివృద్ధి బాట పట్టించారు. ఎమ్మెల్యే సండ్ర కృషితో సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. జిల్లాలో సీతారామ ప్రాజెక్ట్ పూర్తి కావడం లేదని సమావేశాల్లో మాట్లాడుతున్న ఓ నాయకుడు, ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికే టెండర్లు వేయడం, లిక్కర్ షాపులకు టెండర్లు వేసే వ్యక్తి స్కాంల గురించి మాట్లాడడం విడ్డూరం. రైతులకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించే సీఎం ఒక్క కేసీఆర్ మాత్రమే. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే హైదరాబాద్కు మరింత ఖ్యాతి వచ్చింది. పారిశుధ్య నిర్వహణలో హైదరాబాద్ ఇప్పుడు ముంబై, ఢిల్లీ కంటే ముందంజలో ఉన్నది. అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది.
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు