ఖమ్మం సిటీ, ఫిబ్రవరి 7: మూడు నెలల నుంచి వేతనాల్లేక అల్లాడుతున్నామని, దీంతో కుటుంబాలను పోషించుకోవడానికి ఇబ్బంది అవుతుందని ఖమ్మం నగరంలోని జిల్లా ప్రధానాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని జిల్లా ప్రధానాసుపత్రి ఎదుట బుధవారం వివిధ కార్మిక సంఘాలతో కలిసి నిర్వహించిన ధర్నాలో వారు మాట్లాడారు. మూడు నెలల నుంచి కార్మికులకు వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. కార్మికులకు జీతాలు ఇవ్వాలని సదరు కాంట్రాక్టర్ను ప్రశ్నించగా రాష్ట్రప్రభుత్వం తమకు ముట్టజెప్పాల్సిన నిధులను ఇవ్వడం లేదనిసమాధానమిచ్చారన్నారు. వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని నిధులు విడుదల చేయాలని, తమ చేతిలో ఏమీ లేదని చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు.
ఇలా రాష్ట్ర ప్రభుత్వం, వైద్యాధికారులు, కాంట్రాక్టరు కలిసి కార్మికుల పొట్టకొడుతున్నారన్నారు. కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ప్రధానుసుపత్రి ప్రధాన ద్వారం వద్ద సుమారు రెండు గంటలపాటు ధర్నా చేపట్టారు. దీంతో పౌరులకు వైద్యసేవలు అందించడంలో వైద్యులు, వైద్యసిబ్బందికి ఆటంకం కలిగింది. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్కుమార్, ఆర్ఎంవో అమర్సింగ్ కార్మికుల వద్దకు వచ్చారు. రెండు వారాల్లోపు కార్మికులకు వేతనాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కార్మికులు ఆందోళనను విరమించారు. ధర్నాలో వివిధ కార్మిక సంఘాల నాయకులు జీ రామయ్య, విష్ణువర్థన్రెడ్డి, అంబేద్కర్, జగదీశ్, వెంకటరమణ, విజయమ్మ, మమత, ఉదయ్కుమార్, అశోక్కుమార్, వెంకటేశ్, అపర్ణ, కవిత, అనిల్కుమార్, ఉపేందర్, మహేశ్, శ్యాం పాల్గొన్నారు.