మామిళ్లగూడెం, జనవరి 25 : వజ్రాయుధం లాంటి ఓటును ఎన్నికల సమయంలో పారదర్శకంగా వినియోగించుకోవాలని, మంచి పాలన అందించే వారిని ఎన్నుకోవాలని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పిలుపునిచ్చారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్ ఎన్నికల కమిషన్ అందించిన సందేశాన్ని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటు ప్రాముఖ్యతను మరింత బలోపేతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా 2011 నుంచి జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. 2024లో జరుగనున్న లోక్సభ ఎన్నికల్లో అర్హులైన ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.
దేశ భవిష్యత్తు ఓటరు చేతిలోనే ఉంటుందన్నారు. సీనియర్ ఓటర్లు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేస్తూ మనకు ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. కాగా.. సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు కలెక్టర్ జ్ఞాపికలు అందజేశారు. సీనియర్ సిటిజన్లను ఈ సందర్భంగా సన్మానించారు. జిల్లాలో కొత్తగా ఓటరుగా నమోదు చేసుకున్నందుకు వారిని అభినందించి.. వారికి ఓటరు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డి.మధుసూదన్నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మయాంక్ సింగ్, జిల్లా స్వీప్ నోడల్ అధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కె.శ్రీరామ్, ఖమ్మం అర్బన్ తహసీల్దార్ సీహెచ్.స్వామి, కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.