మామిళ్లగూడెం, డిసెంబర్ 30 : నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ నిర్వహించుకునే సంబురాలు ఇతరుల్ని ఇబ్బందిపెట్టే విధంగా ఉండకూడదని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ కొత్త సంవత్సర వేడుకలు సజావుగా జరుపుకునేందుకు పోలీసులకు సహకరించాలని శుక్రవారం ప్రకటనలో సూచించారు. జిల్లాలో అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ట బందోబస్తు, అన్ని ప్రాంతాల్లో పెట్రోలింగ్, విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.
మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి నిర్ణీత సమయంలోనే మద్యం దుకాణాలు, దాబాలు, బార్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మూసి వేయాలన్నారు. ప్రధాన కూడళ్లలో పికెటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. వాహన చోదకులు కచ్చితంగా హెల్మెట్ ధరించాలని, ర్యాలీలు, పటాకుల కాల్చివేత నిషిద్ధమని తెలిపారు. హై స్పీడ్ నియంత్రణకు బారికేడ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్రిబుల్ రైడింగ్, మైనర్ల రైడింగ్పై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేస్తామని, మద్యం మత్తులో ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చితే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు.