ఖమ్మం, ఫిబ్రవరి 8: రాజ్యసభ సభ్యుడిగా తాను చరిత్రలో నిలిచిపోయే శాసనాల్లో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని, సభ్యుడిగా ఉన్నంతకాలం తనకు సహకరించిన నేతలు, ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ప్రకటించారు. ఢిల్లీలోని పార్లమెంట్లో గురువారం జరిగిన పెద్దల సభ చివరి ప్రసంగంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్లో అడుగుపెట్టే అవకాశం కల్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆజన్మాంతం రుణపడి ఉంటానన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా తాను 20 నెలల్లో పాత పార్లమెంట్లోనూ, కొత్త పార్లమెంట్లోనూ కూర్చున్నందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నానన్నారు. తాను మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం పార్లమెంట్లో చర్చించినందుకు, తెలంగాణలో ఏదైనా ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని మాట్లాడినందుకు ఆనందంగా ఉందన్నారు. మున్ముందు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మరిన్ని సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నానని తన ప్రసంగాన్ని ముగించారు.