వైరా టౌన్, నవంబర్ 20 : తెలంగాణ ఏర్పాటు ముందు వరకూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న వైరా నియోజకవర్గం స్వరాష్ట్రం సిద్ధించిన తరువాత సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కచ్చితంగా చెప్పాలంటే గడిచిన పదేళ్లలో నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రమైన వైరా పట్టణం సమగ్రాభివృద్ధిని సాధించింది. గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ఈ పట్టణం ఇప్పుడు మున్సిపాలిటీగా రూపాంతరం చెందడమే గాక తన రూపురేఖలను సమూలంగా మార్చుకుంది. నూతన హంగులను సంతరించుకుంది. మొత్తంగా రూ.3 వేల కోట్లతో ఈ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం తీర్చిదిద్దింది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక పథకమైన మిషన్ భగీరథ ఇక్కడి నుంచి 12 మండలాల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తూ కీర్తిని గడిస్తోంది. వైరా రిజర్వాయర్ వద్ద ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్బండ్ ఆహ్లాదాన్ని అందిస్తోంది. మొత్తంగా వైరా అభివృద్ధిని చూసిన నియోజకవర్గ ప్రజలందరూ ఔరా అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కృషి ప్రశంసిస్తున్నారు.
చెంతనే అతిపెద్ద సాగునీటి రిజర్వాయర్ ఉన్నప్పటికీ పంటలకు సరైన సాగునీరు అందక క్రాప్ హాలీడేలు ప్రకటించిన పరిస్థితి ఉండేది వైరా ఆయకట్టు కింద పదేళ్ల క్రితం.
అంతటి దుర్భర పరిస్థితి నుంచి నేడు పుష్కలంగా సాగునీటి అందించడమేగాక ఏకంగా 12 మండల మండలాల్లో ఉన్న 120 గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా నీటిని అందించేంత సామర్థాన్ని సొంతం చేసుకుంది ఇదే వైరా రిజర్వాయర్. ఇదంతా కేవలం గడిచిన పదేళ్ల కాలంలోనే, అందునా బీఆర్ఎస్ ప్రభుత్వ కృషితోనే సాధ్యమైందంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో వైరా నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక కథనం. గత పాలకుల కాలంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉండేది వైరా నియోజకవర్గంలో అభివృద్ధి పరిస్థితి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో కొత్త పుంతలు తొక్కించారు.గతంలో ఒట్టిపోయినట్లుగా ఉన్న వైరా రిజర్వాయర్ ఆయకట్టు కింద ఇప్పుడు సుమారు 25 వేల ఎకరాల్లో రెండు పంటలకూ పుష్కలంగా సాగునీరు అందుతోంది. గతంలో వర్షం వస్తే గుంతమయంగా, బురదమయంగా ఉన్న రోడ్లన్నీ ఇప్పుడు సీసీ రోడ్లుగా మెరుస్తున్నాయి. పూర్తిస్థాయిలో డ్రెయిన్లు నిర్మించడంతో బుదరకు తావు లేకుండా పోయింది. సెంట్రల్ లైటింగ్ వెలుగులను విరజిమ్ముతోంది. పచ్చందాలతో రహదారులన్నీ పులకరిస్తున్నాయి. వైరాలో వంద బెడ్ల ఆసుపత్రి నిర్మాణానికి సీఎం కేసీఆర్ జీవోను అందజేయడంతో ప్రస్తుతం ఉన్న 30 బెడ్ల ఆసుపత్రి రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందున్నాయి.
నియోజకవర్గంలో సుమారు రూ.3 వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇందులో రూ.20 కోట్లతో వైరా పట్టణంలో సీసీ రోడ్లు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో రూ.30 కోట్ల నిధులతో మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, మినీ ట్యాంక్బండ్, డంపింగ్యార్డుల వంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో రూ.30 కోట్లతో వైరా పట్టణంలో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ నిర్మాణం కొనసాగుతోంది. నియోజవకర్గ ప్రజలు తమ ఎమ్మెల్యేకు తమ సమస్యలను చెప్పుకోవాలంటే వెళ్లేందుకు రూ.10 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించింది. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన వైరా సమీపంలోని కొణిజర్ల మండలంలో ప్రైవేటు కంపెనీ ద్వారా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అంజనాపురం వద్ద నిర్మిస్తున్న ఈ ఫ్యాక్టరీకి రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఇటీవలే శంకుస్థాపన చేశారు. వైరా రిజర్వాయర్ను ఇక్కడి ప్రజల కల్పతరువుగా నిలిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒకవేళ ఈ రిజర్వాయర్లో నీరు తక్కువైతే తక్షణమే పాలేరు జలాశయం నుంచి సాగర్ జలాలను విడుదల చేయించి దీనిని నింపుతోంది బీఆర్ఎస్ ప్రభుత్వం. నియోజకవర్గంలో దళితబంధు కింద 100 యూనిట్లు మంజూరు కావడంతో సుమారు వందమంది ఎస్సీ లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నిండాయి. నియోజకవర్గంలోని కారేపల్లి మండలంలో సుమారు 2,999 మంది పోడు సాగుదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసింది. అదే కారేపల్లి మండలంలో ఏకలవ్య పాఠశాలను నిర్మిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇందులో తరగతులు ప్రారంభంకానున్నాయి. అలాగే, అభివృద్ధి పనుల కోసం వైరా మున్సిపాలిటీకి రూ.241 కోట్లు, వైరా మండలానికి రూ.36 కోట్లు, కొణిజర్లకు రూ.252 కోట్లు, సింగరేణికి రూ.283 కోట్లు, ఏన్కూరుకు రూ.170 కోట్లు, జూలూరుపాడుకు రూ.163 కోట్లు వెచ్చించింది.
వైరా రిజర్వాయర్పై రూ.5 కోట్లతో మినీ ట్యాంక్బండ్ను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. రోడ్డు వెడల్పు చేయడంతోపాటు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసింది. ఆనకట్టపై రైలింగ్, బతుకమ్మ ఘాట్ నిర్మించింది. రూ.34 లక్షలతో సోలార్ లైటింగ్ ఏర్పాటు చేసింది. 2009లో మినీ స్టేడియం నిర్మాణానికి అప్పటి మంత్రి కోనేరు రంగారావు శంకుస్థాపన చేసి వదిలేశారు. అలా అసంపూర్తిగా ఉన్న మినీ స్టేడియంలో రూ.2 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం అద్భుతమైన ఇండోర్ స్టేడియాన్ని నిర్మించింది. ఇందులోనే షటిల్ కోర్టు, లాన్ టెన్నిస్, ఓపెన్ జిమ్ వంటివి కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ ప్రాంత క్రీడాకారుల కలల సాకారమైనట్లయింది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలులో వైరా నియోజకవర్గం ముందంజలో ఉంది. ఈ కార్యాక్రమలతో నియోజకవర్గంలో పచ్చదనం పరిఢవిల్లుతోంది. మిషన్ భగీరథతో 30 ఏళ్ల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. సుమారు రూ.150 కోట్లతో వైరా ప్రాజెక్ట్ వద్ద మిషన్ భగీరథ ప్లాంట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేసి సుమారు 50 వేల ఇళ్లకు శుద్ధజలాలు అందిస్తోంది. సుమారు రూ.30 కోట్లతో వైరాలో నిర్మిస్తున్న గిరిజన ఆత్మ గౌరవ భవనం ఈ ప్రాంత ప్రజల తలమానికంగా నిలువనుంది. స్థానిక సంస్థల బలోపేతంలో భాగంగా గిరిజన నియోజకవర్గమైన వైరాలో సుమారు 30 గ్రామ పంచాయతీలను నూనతంగా ఏర్పాటు చేసింది. ఆ పల్లెలన్నీ నేడు అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయి. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలో వైరా, కొణిజర్ల మండలాలు ఉండడంతో అభివృద్ధి మరింత సులభతరమైంది. వైరా రిజర్వాయర్ రోడ్డులో రూ.కోటి నిధులతో సెంట్రల్ లైటింగ్, డివైడర్లు, సీసీ రోడ్ల ఏర్పాటుకు ప్రభుత్వం శంకుస్థాపన చేసింది.
వైరా నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికే అద్భుతంగా అభివృద్ధి చేసింది. ఈ ఎన్నికల్లో ప్రజలు తనకు అవకాశమిస్తే మిగిలిన పనులనూ పూర్తి చేసి మరింతగా తీర్చిదిద్దుతా. ప్రభుత్వ సహకారంతో ప్రతి గ్రామాన్నీ అభివృద్ధి చేస్తా. తెలంగాణ ఏర్పడిన తర్వాతే వైరా నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారాయి. నియోజకవర్గ అభివృద్ధి ఘనత ముమ్మాటికీ బీఆర్ఎస్ ప్రభుత్వానిదే.