కూసుమంచి, సెప్టెంబర్ 5 : మనిషి చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో కూడా తెలియని దుస్థితి పోయి వైకుంఠధామాలు వచ్చాయి. ఇంటిముందు మురుగునీరు, చెత్త దుర్గంధం లేకుండా ఇంటింటికీ పంచాయతీ ట్రాక్టర్ వచ్చి చెత్తను డంపింగ్యార్డుకు తీసుకెళ్తున్నది. తాగునీటికి తండ్లాటపోయి స్వచ్ఛమైన తాగునీరు ‘మిషన్ భగీరథ’ రూపంలో ప్రతి రోజూ ఇంటికే వస్తున్నది. ఏడాదికోసారి కూడా ఊడవని వీధులు అనుదినం అందంగా దర్శనమిస్తున్నాయి. రాత్రయిందంటే వీధుల్లో కమ్ముకునే చీకట్లను చీల్చుకుంటూ ఎల్ఈడీ బల్బులు విద్యుత్కాంతులను విరజిమ్ముతున్నాయి. వందల కిలోమీటర్ల దూరం పోయి కొనుగోలు చేయాల్సిన మొక్కలు గ్రామ నర్సరీల్లోనే పెరుగుతున్నాయి. పట్టణాలకే పరిమితమైన పార్కులు గ్రామగ్రామాన పల్లెప్రకృతి వనాల రూపంలో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అన్నంపెట్టే రైతన్నల సాదకబాధలు పంచుకునేందుకు రైతు‘వేదిక’లు ఏర్పాటయ్యాయి. దారిపొడుగునా హరితహారం మొక్కలు ఆనందాన్నిస్తున్నాయి. ఇంటింటా పండ్ల మొక్కలు ఫలాలనిస్తున్నాయి. గల్లీగల్లీకి సీసీ రోడ్లు అందంగా కనిపిస్తున్నాయి.. వెరసి పల్లెలు అద్భుత రీతిలో ప్రగతి సాధించి అబ్బురపరుస్తున్నాయి. పల్లెవాసులు ఆనందంగా జీవిస్తున్నారు. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలతో సాధ్యమైందని ఒప్పుకోక తప్పదు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో చేపడుతున్న సంస్కరణలతో శాశ్వత ఆస్తులు సమకూరడంతో పల్లెవాసులు మురిసిపోతున్నారు.
పల్లెల్లో ప్రగతి రథచక్రాలు వేగంగా పరుగులు పెడుతున్నాయి. అద్భుత రీతిలో అభివృద్ధికి తార్కాణంగా నిలుస్తున్నాయి పల్లెలు. గ్రామాలకు కావాల్సిన వనరులు, వసతులు, మౌలిక సదుపాయాల ఏర్పాటులో మన రాష్ట్రం దేశంలో నంబర్వన్ స్థానంలో ఉంది. కేంద్రం ప్రకటించే అవార్డులు సగానికిపైగా మనకే దక్కుతున్నాయంటే ఇది స్వరాష్ట్రం వచ్చాక సాధించిన ప్రగతి అని చెప్పక తప్పదు.
గ్రామాల్లోనే నర్సరీలు
గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఉంటాయని మనం ఊహించమా? నాడు మొక్కలు తీసుకురావాలంటే ఆంధ్రా ప్రాంతానికి వెళ్లి కొనుగోలు చేయాల్సి వచ్చేది. కానీ క్రమంగా గ్రామాల్లోనే నర్సరీలను ఏర్పాటు చేసి శాశ్వతంగా మొక్కలను పెంచుతున్నారు. ప్రతి నర్సరీలో లక్ష మొక్కల చొప్పున జిల్లావ్యాప్తంగా సుమారు 60లక్షల మొక్కలు పెంచుతున్నారు. ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ ఏర్పాటు చేసి అందులో వందలాది రకాల మొక్కలతోపాటు పూలమొక్కలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇళ్లలో, రహదారుల వెంట, ప్రభుత్వ స్థలాల్లో నాటిన మొక్కలు పెరిగి నేడు ఫలాలను అందిస్తున్నాయి. గ్రామాలు పచ్చదనంతో శోభిల్లుతున్నాయి.
పరిమళిస్తున్న పచ్చదనం
హరితహారంలో భాగంగా మొక్కలు పెంచడంతో నేడు పల్లెల్లో ఎక్కడచూసినా పచ్చనిచెట్లు దర్శనమిస్తున్నాయి. జిల్లాలోని 589 పంచాయతీల్లో హరితహారం కింద మొక్కలు నాటారు. పల్లెప్రగతి ఐదు విడతల్లో నాటిన మొక్కలు నేడు పెరిగి పెద్దవై పూలు, పండ్లను ఇస్తున్నాయి. గ్రామాల్లోని రహదారులతోపాటు, ప్రభుత్వ స్థలాలు, రహదారుల వెంట మొక్కలు నాటారు. అన్ని ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటారు. ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఇవ్వడంతో అవి ప్రస్తుతం ఫలాలను ఇస్తున్నాయి. హరితహారంలో జిల్లాలో ప్రతి సంవత్సరం కోటి మొక్కల వరకు పెంచారు. ప్రతి గ్రామంలో రెండు ఎకరాల స్థలంలో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు.
రైతువేదికలు
వ్యవసాయశాఖలో గతంలో మండల వ్యవసాయశాఖ అధికారికి సైతం ఆఫీసు లేని రోజులు. కానీ నేడు క్లసర్టర్కో రైతువేదిక నిర్మించారు. జిల్లాలోని 129 క్లస్టర్లలో ఒక్కో రైతువేదికను 20 నుంచి 25 లక్షల వ్యయంతో నిర్మించారు. వాటిల్లో ప్రతి మంగళ శుక్రవారాల్లో రైతుల సమావేశాలు, అధికారుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో 750 హ్యాబిటేషన్లు ఉండగా వాటిల్లో 460 గ్రామాల్లో క్రీడా మైదానాలకు స్థలాలు గుర్తించి 430 మైదానాలు పూర్తిచేశారు. మిగిలిన 30 వివిధ దశల్లో ఉన్నాయి.
పంచాయతీలకు ట్రాక్టర్లు.. వాటర్ట్యాంకర్లు
గతంలో గ్రామాల్లో చెత్త ఎత్తాలంటే రిక్షా కూడా లేని పరిస్థితి. కానీ నేడు జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు ఒక్కొక్క ట్రాక్టర్, పెద్ద పంచాయతీలైతే మినీ ట్రాక్టర్ను అదనంగా కొనుగోలు చేశారు. వాటితో పంచాయతీ కార్మికులు రోజు వీధులను శుభ్రం చేసి ఇండ్లలోని చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. వాటిల్లో తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తున్నారు. గతంలో ఊరిబయట చెత్త వేస్తే వాటితో దుర్గంధంగా తయారై తీవ్ర ఇబ్బందులు పడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ నేడు అలాంటివి ఏవి లేకుండా గ్రామాల్లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటిస్తున్నారు.
పంచాయతీలకు సొంత ఆస్తులు
గ్రామాల్లో ఒకప్పుడు ప్రతి ఇంట్లో చెత్తను వారికి ఇష్టమొచ్చిన ప్రదేశంలో పడేసేవారు. కానీ నేడు గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ చెత్తను సేకరించి డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. దీంతో వీధులు, ఇండ్లు పరిశుభ్రంగా దర్శనిమిస్తున్నాయి. చెత్తను తొలగించేందుకు పంచాయతీకో ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు. అవి నిత్యం మైకులతో గ్రామాల్లో తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నాయి. సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు చేసి వాటిలో తడి, పొడి చెత్తను వేరు చేస్తూ ఆదాయాన్ని కూడా గడిస్తున్నారు. దీంతో గ్రామాల్లోని ప్రజలు ఆరోగ్యంగా జీవిస్తున్నారు.
పల్లెలకు శాశ్వతంగా ఆస్తులు
గ్రామాల్లో కావాల్సిన మౌలిక వసతులను చేపడుతున్నాం. పల్లెలకు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా ఆస్తులు వనగూరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, స్థానిక నిధులతో పల్లెల్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టాం. గ్రామాల్లో సమస్యలు క్రమంగా తీరుతున్నాయి. పంచాయతీల్లో అభివృద్ధి పనులపై నిత్యం పర్యవేక్షణ చేపడుతున్నాం. వైకుంఠధామాలు, నర్సరీలు, పల్లెప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు, ట్రాక్టర్లు వంటివి గ్రామాల్లో ప్రగతికి అద్దం పడుతున్నాయి. – విద్యాచందన, డీఆర్డీవో, ఖమ్మం