భద్రాచలం, మార్చి 5: ‘ నేను బీఆర్ఎస్ను వీడుతున్నట్లు అనవసర ప్రచారం జరుగుతున్నది. ఆ ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. నేను కడ వరకు బీఆర్ఎస్లోనే కొనసాగుతాను’ అని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. భద్రాచలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలు తనపై ఎంతో నమ్మకం ఉంచి ఎన్నికల్లో గెలిపించారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకొస్తానని విశ్వసించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేసి వ్యక్తిత్వం తనది కాదన్నారు. గతంలో నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలు అభివృద్ధి గురించి పట్టించుకోలేదని, ఇక్కడ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని మండిపడ్డారు. నాటి ప్రభుత్వాలతో వారు సత్సంబంధాలు నెరపలేకపోయారని, నిధులు రాబట్టలేకపోయారని గుర్తుచేశారు. గతంలో జరిగిన తప్పులను తాను పునరావృతం చేయనని ప్రకటించారు.
తాను కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మున్ముందు మంత్రులనూ కలుస్తానని, ఆ విషయంలో వెనుకంజ వేయనన్నారు. ఈ నెల 11న సీఎం రేవంత్రెడ్డి భద్రాచలంలో పర్యటించనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు ప్రజాసమస్యలను గుర్తించి, సీఎంకు నివేదించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ భద్రాచలం మండల అధ్యక్ష, కార్యదర్శులు అరికెళ్ల తిరుపతిరావు, కొండిశెట్టి కృష్ణమూర్తి, నాయకులు సత్యనారాయణమూర్తి, రత్నం రమాకాంత్, చింతాడి చిట్టిబాబు, నర్రా రాము, బొంబోతుల రాజీవ్, గాడి విజయ్, చుక్కా సుధాకర్, మామిడి పుల్లారావు, పెద్దినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.