విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు, కొత్త ఆలోచనలను ఆవిష్కరించేందుకు చక్కటి వేదిక జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్. పుస్తకాల్లోని జ్ఞానం, తరగతి గదిలో నేర్చుకున్న విద్యతో బాలలు తమ మేథాశక్తిని ఉపయోగించి కొత్త కొత్త ఆవిష్కరణలు, పరిశోధనలు చేసేలా వారిని తీర్చిదిద్దుతున్నది ఈ కార్యక్రమం. మనిషి నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు శాస్త్రీయ పద్ధతుల ద్వారా పరిష్కారాలను కనుగొనే సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంచి వారు శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేస్తున్నది. ఈ నెల 30వ తేదీన జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఖమ్మంలోని ఖమ్మం పబ్లిక్ స్కూల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
-ఖమ్మం, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి)
ఖమ్మం, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి) : పాఠశాలల్లోని 10 నుంచి 17ఏళ్ల వయసు గల బాలలను శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు చేసేలా తీర్చిదిద్దాలన్నది జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లక్ష్యం. 1993 నుంచి జాతీయ శాస్త్ర సాంకేతిక సమాచార మండలి ద్వారా రాష్ట్రంలోని ఆ శాఖ ఆధ్వర్యంలో విద్యాశాఖ సహకారంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థ జిల్లా స్థాయిలో చేపడుతున్న కార్యక్రమం ద్వారా పాఠశాలల బాలలు పలు సమస్యలపై నూతన ఆవిష్కరణలకు తెర లేపుతున్నారు. ప్రతి రెండేళ్లకొకసారి ఒక అంశం, అయిదు ఉప అంశాలపై సైన్స్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రతి సంవత్సరం సైన్స్ కాంగ్రెస్ను నిర్వహిస్తున్నారు.
ఒక ప్రధాన అంశం.. ఐదు ఉప అంశాలు
10 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలు జూనియర్స్ గాను, 15 నుంచి 17 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులను సీనియర్స్గా పరిగణిస్తారు. పాఠశాలలో చదివే పిల్లలతోపాటు బడి బయట పిల్లలు కూడా పాల్గొనవచ్చు. ఈ సంవత్సరం
ప్రాజెక్ట్లు ఇలా…
ఒకే పాఠశాల నుంచి ఎన్ని ప్రాజెక్ట్లు అయినా ప్రదర్శించవచ్చు. గ్రూప్ లీడర్తో మాత్రమే జిల్లా స్థాయి ప్రదర్శనలో పాల్గొనాలి. సభ్యులకు అనుమతి లేదు. రిజిస్ట్రేషన్ కౌంటర్స్లో రిజిస్ట్రేషన్ ఫామ్, రెండు సెట్ల అబ్స్ట్రాక్స్, రెండు సెట్ల రిపోర్ట్స్, లాగ్ బుక్ అందజేయాలి. అయిదుగురు బాలలు జట్టుగా, గైడ్ టీచర్ సహకారంతో ఎంచుకున్న ఉప అంశానికి స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించడం, సర్వేలు చేయడం, కారణాలను విశ్లేషించడం, ప్రజల నుంచి ప్రశ్నావళి రూపంలో సమాధానాలను రాబట్టడం, విమర్శనాత్మకంగా సమస్యలపై ఆలోచించి పరిష్కార మార్గాలపై క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశోధనలు చేసి పరిశోధన పత్రాన్ని సైన్స్ కాంగ్రెస్లో గ్రూప్ లీడర్ సమర్పించాలి.
పెరుగుతున్న పరిష్కారాలు..
జిల్లాలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్లో పాల్గొనే విద్యార్థులు సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు. శాస్త్రీయ థృక్పధాన్ని పెంచుకుంటూ ప్రాజెక్ట్ పరిశోధనలో ఉప అంశాలకు అనుగుణంగా జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల బాలలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను ఆకళింపు చేసుకుంటున్నాయి. వాటిని పరిశోధనాత్మకంగా పరిశీలిస్తూ పరిష్కార మార్గాలపై పత్రాలను రూపొందిస్తున్నారు. గతం కంటే ఇటీవలి కాలంలో సైన్స్ కాంగ్రెస్కు ఆదరణ పెరిగింది. 2017వ సంవత్సరంలో జిల్లాస్థాయి ప్రదర్శనకు 78 ప్రదర్శనలు రాగా, 2018లో 105 ప్రదర్శనలు జరిగాయి. 2019లో 120 ప్రదర్శనలు వరకు విద్యార్థులు ప్రాజెక్ట్లు చేశారు. జిల్లాస్థాయితోపాటు రాష్ట్ర, జాతీయస్థాయిలో వారి పరిశోధనా పత్రాలతో అబ్బురపరుస్తున్నారు.
29లోగా రిజిస్ట్రేషన్లు చేయాలి
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 6నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్ట్ల రిపోర్ట్లను ఈ నెల 29వ తేదీలోగా జిల్లా అకడమిక్ కో-ఆర్డినేటర్కు అందజేయాలి. 9440450141లో సైతం వాట్సాప్ మెసేజ్ ద్వారా సమాచారం అందించవచ్చు. ఇంకా ప్రాజెక్ట్లు రూపొందించే విద్యార్థులు సలహాలు, సూచనల కోసం జిల్లా కో-ఆర్డినేటర్ను సంప్రదించవచ్చు.
విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది
జిల్లాలో నిర్వహిస్తున్న సైన్స్ కాంగ్రెస్కు రిజిస్ట్రేషన్లు అధికంగా పెరిగాయి. నూతన ఆవిష్కరణల వైపు విద్యార్థులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రాజెక్ట్ల రూపకల్పనలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. పరిశోధన్మాతకంగా ఉండాలనే ప్రాజెక్ట్ల కోసం టీచర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహించాం.
– సిగసారపు యాదయ్య, డీఈవో, ఖమ్మం