ఖమ్మం, ఫిబ్రవరి 2: కృష్ణా పరిధిలోని రెండు కీలక ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్ను కాంగ్రెస్ ప్రభుత్వం (కేఆర్ఎంబీ)కి అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ లోక్సభా పక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఎంపీలు జి.రంజిత్ రెడ్డి, బి.వెంకటేష్, బి.లింగయ్య యాదవ్, ఆర్.సురేష్రెడ్డి శుక్రవారం ఢిల్లీలో నిరసన చేపట్టారు. ఈ మేరకు కేంద్ర జలశక్తిశాఖ కార్యాలయానికి వెళ్లి ఆ శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను కలిసి తమ అభ్యంతరాలను తెలిపారు. తెలంగాణలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడమంటే ప్రజలను మోసగించినట్లేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ఇక్కడి రైతాంగానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు.
ప్రాజెక్టుల అప్పగింత అంశాలను పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు తీసుకువస్తామన్నారు. కృష్ణా ట్రిబ్యునల్లో విచారణ పూర్తయ్యేవరకు రెండు తెలుగు రాష్ర్టాలకూ 50:50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా ఉందన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడానికి ఆపరేషనల్ ప్రొటోకాల్ ఖరారు చేయాలని, నీటి వాటాలు తేల్చాలని ఇప్పటికే గత ప్రభుత్వం నాడు కేంద్రానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. విద్యుత్ ప్రాజక్టులను భౌగోళిక పద్ధతుల ద్వారా నియంత్రించాలని పట్టుబట్టామన్నారు.