వేంసూరు, మార్చి 5 : రైతులను ప్రోత్సహించేందుకే గ్రామాల్లో బండలాగుడు ఎద్దుల పోటీలు జరుగుతున్నాయని, గ్రామీణ క్రీడలకు కందుకూరు గ్రామం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. కందుకూరులోని శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఆదివారం జాతీయస్థాయి బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో క్రీడలు కనుమరుగవుతున్నాయని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్ క్రీడలకు పెద్దపీట వేసి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతన్నలకు వ్యవసాయ పనుల్లో చేదోడువాదోడుగా ఉండే ఎద్దుల ప్రాముఖ్యతను తెలిపేందుకు ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. హెటిరో అధినేత, ఎంపీ బండి పార్థసారధిరెడ్డి సహకారంతో ఈ పోటీలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. నాలుగు రోజులపాటు జరిగే పోటీలను ప్రతిఒక్కరూ తిలకించాలని కోరారు.
ముగింపు వేడుకల్లో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, కమిటీ నిర్వాహకుడు మందపాటి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ తేలపురెడ్డి హరికృష్ణారెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి కబడ్డీ పోటీలు
కల్యాణ మహోత్సవాల్లో భాగంగా సోమవారం నుంచి మూడ్రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల స్థాయిలో పురుషుల కబడ్డీ పోటీలు జరుగనున్నాయని కబడ్డీ గేమ్స్ కమిటీ నిర్వాహకుడు గొర్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో సోమవారం జరిగే మహా అన్నదానంలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.