తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్నది. ఇందులో భాగంగా‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బస్సు నడిపే డ్రైవర్లు ఫిట్గా ఉండాలని వారికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. సంస్థ డిపోల్లోని డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సుల డ్రైవర్లు, కార్యాలయ సిబ్బందికి వివిధ రకాల వైద్యపరీక్షలు చేసి హెల్త్ ప్రొఫైల్ను రూపొందించింది. ఈ కార్యక్రమంలో మొత్తం 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కిడ్నీ, గుండె జబ్బులు, థైరాయిడ్, షుగర్, బీపీ, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, ఈసీజీ, మోకాళ్ల నొప్పుల పరీక్షలు సహా ఇతరత్రా పరీక్షలన్నీ చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని వైద్యులు చికిత్స కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు. భద్రాద్రి జిల్లాలో కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల పరిధిలో వెయ్యి మందికి పైగా పరీక్షలు చేశారు.
కొత్తగూడెం అర్బన్, డిసెంబర్ 6: ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం – సుఖవంతం, సురక్షితం’, ‘మీ భద్రత మా బాధ్యత’ అనే నినాదాలకు పూర్తి భరోసానిస్తోంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ముఖ్యంగా ఆర్టీసీ ఉద్యోగులు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణికుల భద్రత పరిపూర్ణ అర్థం చేకూరుతుందని విశ్వసించింది. తమ సేవలు నమ్మి తమ సంస్థ బస్సుల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరాలంటే ముందుగా తన ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలని సంకల్పించింది. ఇందుకోసం ‘గ్రాండ్ హెల్త్ చాలెంజ్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ముఖ్యంగా బస్సు నడిపే డ్రైవర్ ఆరోగ్యంగా ఫిట్గా ఉండాలని తలచి.. వారికి సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించింది. అతడితోపాటు ఇతర ఉద్యోగుల హెల్త్ ప్రొఫైల్ను రూపొందించింది. కొత్తగూడెం డివిజన్లోని ఉద్యోగులంతా ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ ప్రొఫైల్ చెబుతోంది.
17 రకాల పరీక్షలు..
‘టీఎస్ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్’లో ఆర్టీసీ సిబ్బంది, అద్దె బస్సుల డ్రైవర్లకు కలిపి మొత్తం 17 రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా కిడ్నీ, గుండె జబ్బులు, థైరాయిడ్, షుగర్, బీపీ, రక్త పరీక్షలు, కంటి పరీక్షలు, ఈసీజీ, మోకాళ్ల నొప్పుల పరీక్షలు సహా ఇతరత్రా పరీక్షలన్నీ చేశారు. వైద్య సహాయానికి సంబంధించిన మరికొన్ని సూచనలు చేశారు. ప్రత్యేకంగా గుండె జబ్బులపై అవగాహన కల్పించారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన ఆహారం గురించి, నిద్రలేమిని, ఒత్తిడిని అధిగమించేందుకు పాటించాల్సిన నియమాల గురించి, ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు.
వెయ్యి మందికిపైగా పరీక్షలు
‘టీఎస్ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్’ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం, భద్రాచలం, మణుగూరు డిపోల్లోని డ్రైవర్లు, కండక్టర్లు, అద్దె బస్సుల డ్రైవర్లు, కార్యాలయ సిబ్బందికి వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. మణుగూరు డిపోలో నవంబర్ 18 నుంచి 23 వరకూ, భద్రాచలం డిపోలో నవంబర్ 24 నుంచి 27 వరకూ, కొత్తగూడెం డిపోలో నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 వరకూ ఈ పరీక్షలు నిర్వహించారు. ఇందులోభాగంగా భద్రాచలం డిపోలో మొత్తం 422 మందికి, మణుగూరు డిపోలో 337 మందికి, కొత్తగూడెం డిపోలో 304 మందికి ఆర్టీసీ వైద్యులు వివిధ వైద్య రకాల పరీక్షలు నిర్వహించారు. వీరిలో భద్రాచలం డిపోలో నలుగురు, మణుగూరు డిపోలో ముగ్గురు మాత్రమే స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారిని వెంటనే హైదరాబాద్కు రిఫర్ చేశారు. వారు అక్కడ వైద్య సేవలు పొంది వచ్చి కోలుకుంటున్నారు.
అందరూ ఆర్యోగంగా ఉండాలన్నదే సంస్థ లక్ష్యం..
ఆర్టీసీ ఉద్యోగులందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్నదే సంస్థ లక్ష్యం. వారు ఫిట్గా లేకపోతే ప్రయాణికులకు సరైన సేవలు అందించలేరు. పైగా వ్యక్తిగతంగా వారి ఆరోగ్యానికీ ప్రమాదకరం. అందుకే సంస్థ ఆదేశాల మేరకు ఉద్యోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాం. ఆర్యోగంగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా సూచించాం. ఈ హెల్త్ చెకప్లో దాదాపు అందరూ ఫిట్గా ఉన్నారు. స్వల్పకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని గుర్తించి తదుపరి చికిత్సల కోసం రిఫర్ చేశాం.
-డాక్టర్ ఏవీ గిరిసింహారావు, సీనియర్ మెడికల్ ఆఫీసర్, టీఎస్ఆర్టీసీ
హెల్త్ చెకప్కు మంచి అవకాశం..
ఆర్టీసీ సిబ్బంది కోసం సంస్థ ఇంతటి మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. విధుల్లో భాగంగా రోజూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణిస్తుంటాం. చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనా అప్పటికప్పడు ఆసుపత్రిలో చెకప్ చేయించుకునే అవకాశం ఉండదు. అలాంటి వారికి ఈ హెచ్త్ క్యాంపు మంచి అవకాశం. ఈ క్యాంపులో ఆర్టీసీ ఉద్యోగులందరమూ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని వైద్యులు గుర్తించి తదుపరి చికిత్స కోసం హైదరాబాద్కు రిఫర్ చేశారు.
-ఇసనపల్లి శ్యాముల్, కండక్టర్
ఎంతో ఆరోగ్యంగా ఉన్నాం..
సంస్థ చేపట్టిన ఈ హెల్త్ క్యాంపులో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాక మాలో ఉన్న భయాలనన్నీ పోయాయి. హెల్త్ చెకప్ అనగానే ఏమైనా అనారోగ్య సమస్యలు బయటపడుతాయేమోననే భయం కలిగింది. ఆర్టీసీ వైద్యాధికారులు మాకు ఆరోగ్య పరీక్షలన్నీ చేసి తాము పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు చెప్పారు. దీంతో భయాలు, సందేహాలు తొలగిపోయాయి. అలాగే చిన్నచిన్న ఆరోగ్య సమస్యలున్నప్పటికీ గుర్తించలేని వాళ్లకు ఈ హెల్త్ కా్ంయపు ఎంతో ఉపయోగపడింది. వారి అనారోగ్య సమస్యలు తెలియడం ద్వారా వాటి నుంచి ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపర్చుకోవాలో వైద్యులు సూచించారు.
– ఎస్కే నూర్జహాన్బీ, కండక్టర్