సత్తుపల్లి :హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ ముందే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం దళితబంధును ప్రవేశపెట్టి అమలుచేస్తుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దాన్ని అడ్డుకునే విధంగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం హేయమైన చర్యని కల్లూరు, వేంసూరు ఎంపీపీలు బీరవల్లి రఘు, పగుట్ల వెంకటేశ్వరరావులు అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దళితులపై ప్రేమ ఉందని చెప్పుకునే బీజేపీ నాయకులు దళితబంధును ఆపడానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేసి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని ఆరోపించారు.
దళితులపై బీజేపీది కపటప్రేమ అని, ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గంలో అమలవుతున్నదళితబంధును ఎన్నికల సంఘం ఎలా ఆపుతుందని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ దళితుల వెనుకబాటు తనాన్ని గుర్తించి వారిని ఆదుకునేందుకు ఆర్ధికంగా ఎదిగేలా చేసేందుకు దళితబంధును ప్రవేశపెట్టి రూ.250కోట్ల నిధులను విడుదల చేశారన్నారు. ఎన్నికల కోసం కాకుండా దళితుల అభ్యున్నతికి దళితజాతి మనుగడకు ఈ పథకాన్ని చేపట్టి అమలుచేస్తున్నారన్నారు.
బీజేపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం తధ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సర్పంచ్లు సింగపోగు పద్మ, రావూరి రమాదేవి, జడ్పీటీసీ మారోజు సుమలత సురేష్, రావూరి శ్రీనివాసరావు, కొరకొప్పు ప్రసాద్, రామాల మోహనరావు, కిన్నెర రాము, రేగా కాంతారావు, అద్దంకి అనిల్, రఘు, నర్సింహారావు, నడ్డి ఆనందరావు, తడికమళ్ల ప్రకాష్రావు తదితరులు పాల్గొన్నారు.