భద్రాచలం, ఆగస్టు 9 : అనాదిగా వస్తున్న గిరిజన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నదని కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా బుధవారం స్థానిక గిరిజన భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోని 90 శాతం భాషలు ఆదివాసీలవేనని, భాషలు లేని ఆదివాసీలు 5 శాతం మాత్రమే అని చెప్పారు. ఆదివాసీలు తక్కువ మంది మాత్రమే తమ భాషలో మాట్లాడతారని, ఇలా ఉండడం వల్ల మన భాష, సంస్కృతీసంప్రదాయాలు అంతరించే పోయే ప్రమాదముందన్నారు. ఆదివాసీ కుటుంబాల్లోని పిల్లలకు చిన్పప్పటి నుంచే సంస్కృతీ సంప్రదాయాలు, భాషలోని ప్రాముఖ్యతను తల్లిదండ్రులు నేర్పించాలన్నారు.
ఆదివాసీ గిరిజనులకు ఏ సమస్య వచ్చినా నేరుగా తనను సంప్రదించాలని, పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. తొలుత ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్, ఏపీవో జనరల్ డేవిడ్రాజ్, ఏవో భీం వివిధ ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ సెంటర్లోని అమరవీరుల స్థూపాలకు పూలమాల వేసి నివాళులర్పించి, ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో పీవో మాట్లాడుతూ గిరిజనుల పిల్లల కోసం గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు నెలకొల్పి వారి విద్యాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఐటీడీఏ ద్వారా అనేక రకాల సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఆదివాసీల సాంస్కృతిక కార్యక్రమాలను వారు తిలకించారు. కాగా.. కలెక్టర్, ఐటీడీఏ పీవోలవ గిరిజన సంఘాల నాయకులు ఘనంగా సత్కరించారు.
అలాగే 10వ తరగతిలో ఏ గ్రేడ్ సాథించిన అంకంపాలె పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు, డీ గొల్లగూడెం హెచ్ఎం విజయలక్ష్మిని పీవో ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ డీడీ మణెమ్మ, ఏసీఎంవో రమణయ్య, ఏటీడీఏ నరసింహారావు, మాజీ ఎంపీ మిడియం బాబురావు, గిరిజన సంఘాల నాయకులు పూనెం కృష్ణ దొర, పాయం రవివర్మ, గుండు శరత్, మురళి, ముర్ల రమేశ్, కారం పుల్లయ్య, వీరస్వామి, చిచ్చడి శ్రీరామమూర్తి, సుధారాణి, అరుణ, వెంకటరావు, పూనెం వీరభద్రం, వివిధ గ్రామాల నుంచి వచ్చి గిరిజన సంఘాల నాయకులు, పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.