ఖమ్మం, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ శాసన సభా ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ నెల 3వ తేదీ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించామని, 10వ తేదీతో గడువు ముగిసిందని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతీయ ఎన్నికల పరిశీలకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా ఐదు నియోజకవర్గాల్లో 147 మంది అభ్యర్థుల నుంచి 215 నామినేషన్ల సెట్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారన్నారు. ఈ నెల 13న నామినేషన్ల స్క్రూట్నీ అనంతరం పోటీకి అర్హత ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించి వారి నుంచి ఉప సంహరణలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 15వ తేదీ మధ్యాహ్నం వరకు ఉప సంహరణకు అవకాశం ఉందని తెలిపారు. పోటీ నుంచి తప్పుకున్న అభ్యర్థుల అనంతరం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించి వారికి ఎన్నికల నిబంధనల ప్రకారం గుర్తులు కేటాయించడంతో పాటు బ్యాలెట్లో గుర్తుల ముద్రణకు పంపిస్తామని తెలిపారు.
జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారని కలెక్టర్ తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ వరకు ఓటు కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించామని వారితో కలిసి జిల్లా వ్యాప్తంగా 12,16,796 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో పురుషులు 5,89,165 మంది, స్త్రీలు-6,27,553 మంది, ట్రాన్స్ జెండర్లు-78, ఎన్ఆర్ఐ-154, సర్వీస్ -684, దివ్యాంగులు – 25,807, సీనియర్ సిటిజన్స్-16,782 మంది ఉన్నారని తెలిపారు. 18-19 ఏళ్ల మధ్య ఉన్న యువ ఓటర్లు 4.06 శాతంతో 49,396 మంది ఉన్నారని అన్నారు. అత్యధిక యువ ఓటర్లు ఉన్న జిల్లాగా తెలంగాణ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు.
జిల్లాలో, ఇతర జిల్లాలో ఎన్నికల విధులు, ఇతర అత్యవసర సేవలు, దివ్యాంగులు, వృద్ధులు తదితర విభాగాలలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోస్టల్ బ్యాలెట్ల్ కోసం అవసరం ఉన్న వారికి జారీ చేస్తున్నామని తెలిపారు. వీరిలో ఎన్నికల విధులలో ఉన్న పీవోలు, ఏపీవోలు 3,186, ఓపీవోలు 3,005, పోలీస్ సిబ్బంది 1,605, 15వ బెటాలియన్ 227, జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది 86, ఇతర జిల్లాలో పని చేస్తున్న ఉద్యోగులు 16 మందికి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు స్వీకరించామన్నారు. వీరందరు వారి శిక్షణ సమయం ముగిసిన తరువాత అక్కడే ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్లలో వేయాల్సి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా దివ్యాంగులు, వయోవృద్ధుల కేటగిరిలో ఏవీఎస్సీ 965, ఏవీపీడీ 669, ఏవీఈఎస్ 981 మంది నుంచి పోస్టల్ బ్యాలెట్లో భాగంగా తమ పరిధిలో ఉన్న ఆర్వో కార్యాలయాలతో పాటు దివ్యాంగులు, వయోవృద్ధుల ఓట్లను నేరుగా ప్రత్యేక సిబ్బంది ఇంటి వద్దకు వెళ్లి ఓటును వేయిస్తారని తెలిపారు. దీనిని పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామని ప్రత్యేక వాహనంలో ఈవీఎంలను ఏర్పాటు చేసి పూర్తి భద్రతల మధ్య ఓటును వేయిస్తామని తెలిపారు.
జిల్లా ఉన్న 1,456 పోలింగ్ కేంద్రాలలో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ప్రత్యేక వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలన చేస్తామని తెలిపారు. వాటిలో ప్రధానంగా 1295 కేంద్రాలలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసే ప్రత్యేక టీవీల ద్వారా పరిశీలన చేస్తామని తెలిపారు. ఓటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడ సిబ్బందికి ఏవైనా ఇబ్బందులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. మిగిలిన కేంద్రాల వద్ద వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలలో 390 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని తెలిపారు. వాటి వద్ద ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేస్తున్నామన్నారు.
జిల్లా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, చెక్ పోస్టుల ద్వారా అక్రమ రవాణాలకు చెక్ పెడుతున్నామన్నారు. ఇప్పటికే రూ.5,01,58,457 నగదు సీజ్ చేశామని వాటిలో సరైన ఆదారాలు చూపించిన వారి నగదును విడుదల చేశామన్నారు. 35,313.3 లీటర్ల మద్యం స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. రూ. 1,10,61,486 విలువ గల 437.035 కేజీల గంజాయిని సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేసి రిమాండ్కు తరలించామన్నారు. అదేవిధంగా అనుమతులు లేకుండా అమ్ముతున్న రూ.18,12,116 విలువ గల 1974 క్రాకర్స్, రూ.1,24,074 విలువ గల సెల్ఫోన్స్-9, రూ1,77,000 విలువ గల స్టీల్ బాక్స్లు, మరో రూ. 6,27, 310 విలువ చేసే 433 క్రాకర్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే టవల్స్-8205, చీరలు, చున్నీలు, ఇతర వస్ర్తాలు 17 టన్నుల వరకు ఉన్నాయని వాటి విలువ రూ.8,61,260 వరకు ఉంటాయన్నారు. రూ.76,000 వేల డ్రస్ మెటిరియల్స్-400, గోడ గడియారాలు 9,570 వాటి విలువ రూ.46,89,300వరకు ఉంటుందన్నారు. అదేవిధంగా 22 క్రాకర్స్ పెట్టలే 1 బ్యాగ్ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వాటికి సంధించిన సరైన ఆదారాలు ఉంటే వెంటనే అప్పగిస్తామని తెలిపారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాలలో జిల్లాలో సాధరణ ఎన్నికల పరిశీలకులు, వ్యయ ఎన్నికల పరిశీలకు వచ్చారని తెలిపారు. వారిలో ఖమ్మం, పాలేరు సాధరణ ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు ఒడిస్సాకు చెందిన తుశార్ కాంత మహంతి ఐఏఎస్-సెల్-9346293006, మధిర, వైరా నియోజకవర్గాలకు సాధరణ ఎన్నికల పరిశీలకులుగా రాజస్థాన్కు చెందిన కానారామ్-సెల్-9398560944, సత్తుపల్లి నియోజకవర్గానికి సత్యేంద్ర సింగ్-సెల్-9398559986లను ఎన్నికల సంఘం నియమించిందన్నారు. అదేవిధంగా వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారులు ఖమ్మం, పాలేరుకు కునాల్కుమార్-9398598148, మధిర సత్తుపల్లి, వైరాకు రాజీవ్కుమార్ సింగ్-సెల్-8919385028లను నియమించిందన్నారు. శాంతి భద్రల పరిశీలకులుగా ఐపీఎస్ అధికారులు ఖమ్మం, పాలేరుకు బ్రిజేష్కుమార్రాయ్-సెల్-8763294346, మధిర, వైరా, సత్తుపల్లికి మంజునాధ్.హెచ్-సెల్-9498144544లను ఎన్నికల సంఘం నియమించిందని వివరించారు. ఈ మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నియామకం పొందిన పరిశీలకులతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, డీఎఫ్వో విక్రమ్సింగ్ సిదార్థ, జిల్లా నోడల్ అధికారులు, ప్లాయింగ్ స్కాడ్ అధికారులు పాల్గొన్నారు.