భద్రాచలం, అక్టోబర్ 19: భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సనిధ్నిలో భక్తిశ్రద్ధలతో శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలు కొనసాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా బుధవారం లక్ష్మీతాయారమ్మ ధాన్యలక్ష్మి అలంకరణలో దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయం అమ్మవారికి పంచామృతాలు, నారికేళ రసాలు, తొమ్మిది రకాల పండ్ల రసాలతో అభిషేకించారు. అష్టోత్తర శత నామార్చన చేశారు. మహిళలతో కుంకుమార్చన చేయించారు.
సాయంత్రం దర్బార్ సేవ నిర్వహించి వాగ్గేయకారులు భక్త రామదాసు, తూము నరసింహదాసు కీర్తనలను ఆలపించారు. రాత్రికి తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ చేపట్టారు. కాగా గురువారం అమ్మవారు విజయలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వనున్నారని ఆలయ అధికారులు తెలిపారు